ఎంవీఏకు బలం చేకూర్చిన కాంగ్రెస్ కొల్హాపూర్ గెలుపు
ABN , First Publish Date - 2022-04-16T23:11:03+05:30 IST
మహారాష్ట్రలోని అధికార మహా వికాశ్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం శనివారంనాడు వెలువడిన ...
కొల్హాపూర్: మహారాష్ట్రలోని అధికార మహా వికాశ్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం శనివారంనాడు వెలువడిన కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితంతో సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ భాగస్వామ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిని 18,000 పైచిలుకు ఓట్లతో ఓడించింది.
కాంగ్రెస్-ఎంవీఏ అభ్యర్థి జయశ్రీ జాధవ్ 96,176 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి సత్యజీత్ కదమ్కు 77,426 ఓట్లు పోలయ్యాయి. దీంతో 18,750 ఓట్ల తేడాతో జయశ్రీ జాదవ్ గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్ 2021 డిసెంబర్లో కోవిడ్తో మరణించడంతో కొల్హాపూర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. జాదవ్ భార్య జయశ్రీ జాదవ్ను కాంగ్రెస్ పోటీలోకి దింపింది. ఈనెల 12 పోలింగ్ జరుగగా, 61.19 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ సంబరాలు..
కొల్హాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. తనను గెలిపించిన ఓటర్లకు జయశ్రీ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు ఎంవీఓలోని మూడు భాగస్వామ్య పార్టీలు సమష్టిగా కృషి చేసినట్టు చెప్పారు. కాగా, ఈ గెలుపును ''ప్రగతిశీల ఆలోచనల విజయం''గా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలో అభివర్ణించారు. ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.