నేటినుంచి బూస్టర్ డోస్
ABN , First Publish Date - 2022-01-10T16:33:05+05:30 IST
రాష్ట్రంలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించనున్నారు. రెండు డోస్లుగా ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో దానిని బూస్టర్ డోస్గా వేయనున్నారు
లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
తొలిరోజు 4 లక్షల మందికి పంపిణీ
చెన్నై: రాష్ట్రంలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించనున్నారు. రెండు డోస్లుగా ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో దానిని బూస్టర్ డోస్గా వేయనున్నారు. రాష్ట్రంలో ఈ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకునేందుకు 35.46లక్షల మంది అర్హత కలిగి ఉన్నారని, సోమవారం నాలుగు లక్షల మందికి ఈ టీకాలు వేయనున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ వైరస్ల వ్యాప్తి నిరోధానికి వ్యాక్సినేషన్ డ్రైవ్లు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.83కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకున్నారని, వీరిలో 87.35 శాతం మంది మొదటి డోస్, 61.45 శాతం మంది రెండవ డోస్ తీసుకున్నారని వివరించారు. రాజధాని నగరం చెన్నైలో 92 శాతం మంది మొదటి డోస్, 77 శాతం మంది రెండో విడత వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కరోనా మ్యూటేషన్ ‘ఒమైక్రాన్’ వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది.
ఆ మేరకు సోమవారం బూస్టర్ డోస్ వేయడం ప్రారంభిస్తున్నారు. పట్టినంబాక్కం ఎంఆర్సీ నగర్లోని ఇమేజ్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించ నున్నారు. రెండు డోస్లు వేసుకున్న ఫ్రంట్లైన్ వారియర్స్ వైద్యులు తది తరులకు, 60 యేళ్లు దాటినవారికి ఈ బూస్టర్డోస్ వేయనున్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు వేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35.46 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. వీరిలో టీకాలు వేసుకుని తొమ్మిదినెలలు దాటినవారు, 2021 ఏప్రిల్ 14కు ముందు టీకాలు వేసుకున్నవారు. బూస్టర్ డోస్ టీకాలు వేసుకోవటానికి అర్హులని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.