94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేశాం: బొప్పరాజు
ABN , First Publish Date - 2021-11-28T19:47:07+05:30 IST
తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం ఏపీ జేఏసీ నేత బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ 11వ పీఆర్సీ అమలు, సీసీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ,.. రూ.1600 కోట్ల చెల్లింపులపై చర్చించామన్నారు. అమరావతి జేఏసీ తరపున ఆదివారం సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని బొప్పరాజు విమర్శించారు. ఆర్థిక మంత్రి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా ఆర్థికమంత్రి చర్చించారా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే ఒప్పుకోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయన్నారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని బొప్పరాజు అన్నారు.