దేవుడి దయ ఉంటే 24 మందిలో మళ్లీ ఉంటా: బొత్స

ABN , First Publish Date - 2022-04-08T00:58:29+05:30 IST

సీఎం జగన్ తన కొత్త కేబినెట్‌ను 24 మందితో ఏర్పాటు చేస్తారని అదికారపార్టీ నేతలు చెబుతున్నారు. ముందు అనుకున్నట్లే మంత్రులు రాజీనామా చేశారు.

దేవుడి దయ ఉంటే 24 మందిలో మళ్లీ ఉంటా: బొత్స

అమరావతి: సీఎం జగన్ తన కొత్త కేబినెట్‌ను 24 మందితో ఏర్పాటు చేస్తారని అదికారపార్టీ నేతలు చెబుతున్నారు. ముందు అనుకున్నట్లే మంత్రులు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో తిరిగి కొందరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న వారిలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ  దేవుడి దయ ఉంటే 24 మందిలో మళ్లీ ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తేవడమే టార్గెట్‌‌గా పనిచేస్తామని ప్రకటించారు. మంత్రివర్గ మార్పు చేర్పుల్లో సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ఎవరిని కొనసాగించాలో ఆయన ఇష్టమన్నారు. కొత్త కేబినెట్‌లో బడుగు, బలహీనవర్గాలకు అవకాశం ఇస్తారని తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తానని, సీఎం ముందే చెప్పారని గుర్తుచేశారు. అందరం సంతోషంగా సీఎంకి రాజీనామాలు ఇచ్చామని వెల్లడించారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేది సీఎం ప్రణాళిక ఇస్తారని పేర్కొన్నారు. కొత్త కేబినెట్‌లో సామాజిక సమీకరణాలు ఉంటాయని తెలిపారు. విశాఖ భూములపై టీడీపీ ఆరోపణలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తప్పుబట్టారు. ఎన్‌సీసీ భూములపై 2019లో మాజీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లో పెట్టారని తెలిపారు. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు జీవో ఇచ్చారని విమర్శించారు. విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదేనని బొత్స సత్యనాయణ ఆరోపించారు.

Updated Date - 2022-04-08T00:58:29+05:30 IST