కరోనాతో బడి మానేసిన అబ్బాయి.. కథ వింటే కన్నీళ్లే..

ABN , First Publish Date - 2020-11-17T20:44:03+05:30 IST

కరోనా మహమ్మారి వేలాదిమంది జీవితాలను అతలాకుతలం చేసేసింది. అప్పటి వరకూ ప్రశాంతంగా బతుకు వెళ్లదీస్తున్న వారి జీవితాలను రాక్షసిలా దూకి చిందరవందర చేసేసింది.

కరోనాతో బడి మానేసిన అబ్బాయి.. కథ వింటే కన్నీళ్లే..

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా మహమ్మారి వేలాదిమంది జీవితాలను అతలాకుతలం చేసేసింది. అప్పటి వరకూ ప్రశాంతంగా బతుకు వెళ్లదీస్తున్న వారి జీవితాలను రాక్షసిలా దూకి చిందరవందర చేసేసింది. ఇలాగే కరోనా కారణంగా జీవితం మారిపోయిన ఓ అబ్బాయి కథ ప్రస్తుతం నెటిజన్ల గుండెలు బరువెక్కిస్తోంది. ఫైటర్ పైలట్ అవుతానంటున్న ఈ బాలుడు.. ప్రస్తుతం ముంబై వీధుల్లో టీ అమ్ముకుంటున్నాడు. ఇంతకీ ఇతని కథేంటంటే..

చాలా రోజుల క్రితం.. అంటే కరోనా రావడానికి ముందే ముంబైలో ఓ వ్యక్తి మరణించాడు. అతనికి తెలిసిన వాళ్లు కొంచెం బాధపడ్డారు. మిగతా వారికి అసలు విషయమే తెలీదు. కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబం మాత్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. అతనికి ఓ కొడుకు, ఓ కుమార్తె. ఇద్దరూ చదువుకుంటున్నారు. పిల్లలను చదువు మాన్పించడం ఇష్టంలేని వారి తల్లి.. తానే అంతా అయ్యి వారిని చదివించసాగింది. దీనికోసం ఎన్నో కష్టాలు పడుతోంది. వీటిని చూసిన ఆమె కుమారుడు.. తాను ఏదైనా చేయాలని అనుకున్నాడు. అతనికి ఆ తల్లి ఒకటే చెప్పింది. ‘‘చదువుకో.. చదువొక్కటే మన బతుకులు మార్చగలదు’’ అన్న తల్లి మాటలు అతని మనసులో బాగా నాటుకుపోయాయి.



ఓసారి జాగ్రఫీ ఎగ్జామ్‌లో ఆ అబ్బాయి అతి కష్టమ్మీద పాసయ్యాడు. ఫెయిలయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆరోజు తల్లి పడిన బాధ అతనికి ఇంకా గుర్తుందట. కొడుకును ఫైటర్ జెట్ పైలట్ చేయాలనేది ఆమె కోరిక. ఆమె కళ్లలో ఆశ చూసిన ఆ అబ్బాయి కూడా తాను కచ్చితంగా పైలట్ అవుతానని మనసులోనే శపథం చేసుకున్నాడు. ఇంతలోనే ప్రపంచం మొత్తాన్ని రాక్షసిలా తొక్కుకుంటూ వచ్చిన కరోనా మహమ్మారి వీరి జీవితాలను కూడా చిదిమేసింది. తల్లికి పని లేకుండా పోయింది. పిల్లలు ఆకలితో పడుకుంటుంటే ఆ తల్లి మనసు విలవిల్లాడసాగింది. అప్పుడే ఆ అబ్బాయి దగ్గరలోని ఓ కిరాణా షాపలో పనికి కుదిరాడు. వచ్చే జీతం తక్కువైనా తల్లి, చెల్లి ఆకలి తీరుస్తున్నందుకు సంతోషించాడు.



ఇది జరిగిన కొంతకాలానికి తనే సొంతగా ఏదైనా చేయాలనుకున్నాడు. నాగ్‌పాడా ప్రాంతంలోని ఓ పరాటా షాపు యజమానితో మాట్లాడాడు. అతని షాపులోనే ఓ పక్క పొయ్యి పెట్టుకొని టీ తయారుచేసి, దాన్ని ప్లాస్కులో పోసి ఆ మార్గంలో ఉన్న దుకాణాలన్నింటి దగ్గరకూ వెళ్లి అమ్ముకుంటున్నాడు. ప్రస్తుతానికి వాళ్ల జీవితం సాగిపోతోంది. కానీ అతని తల్లి మాత్రం కొడుకు చదువు పాడైపోయిందని, దానికి తానే బాధ్యురాలినని వ్యధచెందుతోంది. ఈ కథ తెలుసుకున్న ఓ ఫేస్‌బుక్ పేజ్ ఈ బాలుడి జీవితాన్ని వివరిస్తూ ఓ పోస్టు పెట్టింది. అది చూసిన చాలామంది నెటిజన్లు తాము కచ్చితంగా అతనికి సాయం చేస్తానని కామెంట్స్ చేస్తున్నారు.



ఈ పోస్టులో మాట్లాడిన సదరు బాలుడు.. ‘‘కుటుంబం గురించి ముందు ఆలోచించాలని అమ్మే నాకు నేర్పింది. ఇప్పుడు అదే పని నేను చేస్తుంటే ఎందుకు బాధ పడుతుందో అర్థం కావడం లేదు. నేను పైలట్ అవ్వనని అనుకుంటుందేమో. నేను కచ్చితంగా పైలట్ అయితీరుతా’’ అంటున్నాడు. ఇతని కోసం ఫేస్‌బుక్‌లో ఓ ఫండ్‌రైజర్ పేజ్ క్రియేట్ చేయాలని, లేదంటే అతని అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని నెటిజన్లు అడుగుతున్నారు.

Updated Date - 2020-11-17T20:44:03+05:30 IST