వైభవంగా బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-07T06:00:21+05:30 IST

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో చతుర్థ వార్షికబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శనివారం వైభవంగా జరిగింది. శనివారం కావడంతో భక్తులు బారులుదీరారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు
శేషవాహనం వద్ద పూజలు నిర్వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

- ఘనంగా అంకురార్పణ, ధ్వజారోహణం

- శేష, చంద్రప్రభ వాహనాలపై కనువిందు చేసిన శ్రీవారు

 కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 6: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో చతుర్థ వార్షికబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శనివారం వైభవంగా  జరిగింది. శనివారం కావడంతో భక్తులు బారులుదీరారు. ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్‌ దంపతులకు ఈవో పీచర కిషన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, అర్చకులు, ఉత్సవకమిటీ బాధ్యులు పూర్ణకుంభస్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం, పూజల తర్వాత యాగశాలలో జరిగిన విశ్వక్సేనారాధన, వాసుదేవపుణ్యాహవచనం, రక్షాసూత్ర పూజల్లో మంత్రి పాల్గొని కంకణ ధారణ చేసుకున్నారు. అనంతరం మంత్రి ఆలయ ఆవరణలో మృత్సంగ్రహణంలో పాల్గొని పూజలు చేసి పుట్టమన్ను తీసుకొచ్చారు. తొలిరోజు ఉదయం శేషవాహనంపై శ్రీవారు కనువిందు  చేశారు. ద్వారతోరణపూజ, చతుస్థానార్చన తర్వాత సూర్యరశ్మితో వెలిగించిన అగ్నితో శాస్త్రోక్తంగా అగ్నిప్రతిష్ట చేసి ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌, కొండగట్టు ఆలయ ఇన్‌చార్జి  ఈవో ఆకునూరి చంద్రశేఖర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందాపతి శ్రీవారిసేవాసమితి అధ్యక్షకార్యదర్శులు పాలవేడు శ్రీనివాస్‌, నటరాజ్‌ రవి బృందం ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు, చిందం చిత్రాశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కొనసాగాయి.  రాత్రి చంద్రప్రభవాహనంపై శ్రీవారు మంత్రముగ్ధుల్ని చేశారు. కార్యక్రమంలో అర్చకులు చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యులు, చెన్నోజ్వల నాగరాజాచార్యులు, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈవో పీచర కిషన్‌రావు, తాత్కాలిక ఉత్సవకమిటీ బాధ్యులు రమేశ్‌, ప్రసాద్‌, రవీందర్‌, దేవత, రవికుమార్‌, సంతోష్‌కుమార్‌, పాపిరెడ్డి, తిరుపతి, వనిత, రాహుల్‌నారాయణ, లత, ఉపేంద్రనాథ్‌, శ్రీనివాస్‌, సుభాష్‌ పాల్గొన్నారు. 


 శ్రీవారి సేవలో కలెక్టర్‌, సీపి

 వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం  కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. అలయంలో, యాగశాలలో, మోహినీరూప శ్రీవారి చంద్రప్రభ వాహనం వద్ద పూజలు చేశారు. ఈవో కిషన్‌రావు శేషవస్త్రాలు, జ్ఞాపికలు, శ్రీవారి ప్రసాదం అందజేశారు. అంతకుముందు  వారికి పూర్ణకుంభస్వాగతం పలికారు. గోగుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో బొజ్జ రేవతి, కట్ట మంజులాదేవి బృందం ఆలపించిన కీర్తనలు అలరించాయి. కలెక్టర్‌, సీపీ కళాకారులను సన్మానించారు. అనంతరం టౌన్‌, రూరల్‌ ఏసీపీలు డాక్టర్‌ అశోక్‌, విజయసారధి స్వామివారిని దర్శించుకున్నారు. 


బ్రహ్మోత్సవాల్లో నేడు 

 బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, 8 గంటలకు తిరుప్పావడసేవ, అనంతరం సూర్యప్రభవాహనసేవ, సాయంత్రం 6 గంటలకు సహస్రదీపాలంకరణసేవ, రాత్రి 8 గంటలకు కల్పవృక్షవాహనసేవ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 


Updated Date - 2021-03-07T06:00:21+05:30 IST