రూ.8 లక్షల పెట్టుబడి.. ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ.25 కోట్ల వ్యాపారం.. పదో తరగతి కూడా పాస్ కాలేదు కానీ..
ABN , First Publish Date - 2022-05-28T16:45:15+05:30 IST
ఇది బర్గర్ ఫామ్ విజయ గాథ. ఇద్దరు స్నేహితులు..
ఇది బర్గర్ ఫామ్ విజయ గాథ. ఇద్దరు స్నేహితులు పాఠశాల విద్యతోనే చదువుకు స్వస్తి చెప్పి, ఇంటిలోని ఒక గదిలో దీనిని ప్రారంభించారు. బర్గర్ ఫామ్ ప్రారంభం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. చదువు మానేసిన పరమవీర్ సింగ్, రజత్ 2013లో ఓ ట్యూషన్ సెంటర్లో స్నేహితులుగా మారారు. ట్యూషన్ అయిపోగానే ఇద్దరూ కలిసి బజారులో బర్గర్లు తినడానికి వెళ్లేవారు. ఒకరోజు బర్గర్ తింటుండగా ఇద్దరి మదిలో ఒక ఆలోచన మెదిలింది. తాము ఎందుకు బర్గర్ వ్యాపారం చేయకూడదని అనుకున్నారు. ఈ కలను నెరవేర్చుకోవడానికి భోజనప్రియులైన ఈ స్నేహితులిద్దరూ మార్కెట్లో పరిశోధన ప్రారంభించారు.
ఈ నేపధ్యంలో జైపూర్ నుండి ఢిల్లీ వరకు, ప్రతి అతిపెద్ద బహుళజాతి బ్రాండ్ బర్గర్లను సైతం రుచి చూశారు. 2014 సంవత్సరంలో వారు తమ ఇంటి ముందు గది నుంచే మొదటి అవుట్లెట్ను ప్రారంభించారు. ఇందుకు రూ.8 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. తమ బర్గర్ని ఇతర బర్గర్లకన్నా భిన్నంగా తయారు చేసేందుకు, మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేశానని వారిలో ఒకరైన రజత్ చెప్పాడు. ఆరోగ్యాన్ని అందించేలా బచ్చలికూర, మొక్కజొన్న కలిపిన వెజిటబుల్, చీజ్ వేసి కొత్త రకాల బర్గర్లను సిద్ధం చేశారు. మొదట్లో సిబ్బంది లేరని పరమవీర్ తెలిపారు. అప్పుడు వారి తల్లిదండ్రులు వీరికి పనులలో సహకారం అందించేవారు. రజత్ కుటుంబ సభ్యులు దుకాణంలో వంతులవారీగా సహాయం చేసేవారు. కాలానుగుణంగా కస్టమర్ల రద్దీ పెరుగుతూ వచ్చింది. దుకాణంలో కూరగాయలను వారి ఇళ్లలోని వారే బజారుకు వెళ్లి తెచ్చేవారు. పరమజీత్ కుటుంబానికి ఆటోమొబైల్ విడిభాగాల వ్యాపారం ఉంది. రజత్ కుటుంబానికి నగల వ్యాపారం ఉంది. ఇద్దరితో ప్రారంభమైన ఈ బర్గర్ ఫామ్లో నేడు 200 మందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఏడాదికి రూ.25 కోట్ల వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్లోని జైపూర్లోనే బర్గర్ ఫామ్కు 12 అవుట్లెట్లు ఉన్నాయి. ఇంతేకాకుండా జోధ్పూర్, కోట, శ్రీగంగానగర్లలో ఒక్కొక్క ఔట్లెట్ ఉంది. త్వరలో రాజస్థాన్ అంతటా ఫ్రాంచైజీ వ్యవస్థను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.