శభాష్ వర్షా.. ఫోన్ను లాక్కుని పారిపోతున్న దొంగను వెంటాడి.. కత్తితో పొడిచినా వదలని బీఈడీ యువతి..!
ABN , First Publish Date - 2021-12-17T18:47:34+05:30 IST
ఫోన్ను లాక్కుని పారిపోతున్న ఓ దొంగను ధైర్యంగా వెంబడించింది ఓ యువతి. అతను కత్తితో మూడుసార్లు పొడిచినా కూడా ఆమె ఆ దొంగను వదల్లేదు.
ఫోన్ను లాక్కుని పారిపోతున్న ఓ దొంగను ధైర్యంగా వెంబడించింది ఓ యువతి. అతను కత్తితో మూడుసార్లు పొడిచినా కూడా ఆమె ఆ దొంగను వదల్లేదు. ఆ యువతి ఎంతకూ తనను వదలకపోవడంతో అతను ఆమె పొట్టలో పొడిచి పొలాల్లోకి విసిరేశాడు. ఆ ఘటనను చూసిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో గురువారం ఈ ఘటన జరిగింది.
ఐఎఫ్టీఎమ్ యూనివర్సిటీలో బీఈడీ చదువువుతున్న వర్షా రాణి అనే యువతి గురువారం సాయంత్రం 4 గంటలకు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే ఒక వ్యక్తి మఫ్లర్ ధరించి గేటు వద్ద వున్నాడు. వర్ష బయటకు రాగానే ఆమె ఫోన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే వర్ష అంత సులభంగా అతడిని వదలలేదు. అతడి చెయ్యి పట్టుకుని కదలనివ్వలేదు. దీంతో ఆ దుండగుడు కత్తి తీసి వర్ష మొహం మీద మూడుసార్లు పొడిచాడు. అయినా వర్ష వదల్లేదు.
చివరకు వర్ష పొట్టలో కత్తితో పొడిచి ఆమెను రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి విసిరి పారిపోయాడు. వర్ష కేకలు విని పరిగెత్తుకు వచ్చిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. వర్ష ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.