బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం..!

ABN , First Publish Date - 2021-03-25T16:05:19+05:30 IST

బ్రెజిల్‌లో మహమ్మారి కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గురువారంతో కొవిడ్-19 మరణాల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటింది.

బ్రెజిల్‌లో కరోనా మరణ మృదంగం..!

ప్రపంచంలోనే అత్యధిక మరణాల్లో రెండో స్థానం

మూడు లక్షల మార్క్‌ను దాటిన మరణాలు

బ్రెసీలియా: బ్రెజిల్‌లో మహమ్మారి కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గురువారంతో కొవిడ్-19 మరణాల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటింది. దీంతో అత్యధిక మరణాల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో నిలిచింది. బుధవారం బ్రెజిల్ వ్యాప్తంగా 2,009 మంది వైరస్‌కు బలయ్యారు. మంగళవారం కూడా ఓకేరోజు 3,251 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,00,685కు చేరినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 75 రోజుల్లో ఏకంగా లక్ష మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. రాజకీయ సమన్వయం లేకపోవడం, కొత్త వేరియంట్లు సులువుగా వ్యాప్తి చెందుతుండటం, దేశంలోని అనేక ప్రాంతాల్లో హెల్త్ ప్రోటోకాల్‌లను విస్మరించడం వంటివి మహమ్మారి విజృంభణకు కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు, కేసుల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు యూఎస్‌లో 5,45,237 మందిని వైరస్ కబళించింది.  

Updated Date - 2021-03-25T16:05:19+05:30 IST