పాసుపుస్తకానికి లంచం
ABN , First Publish Date - 2021-08-03T05:38:58+05:30 IST
పంటపొలానికి పాసుపుస్తకం జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన వెలుగోడు-3 వీఆర్వో ఈడిగ వెంకటేశ్వర్లు సోమవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
- ఏసీబీకి చిక్కిన వెలుగోడు వీఆర్వో
ఆత్మకూరు(వెలుగోడు), ఆగస్టు 2: పంటపొలానికి పాసుపుస్తకం జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన వెలుగోడు-3 వీఆర్వో ఈడిగ వెంకటేశ్వర్లు సోమవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వెలుగోడు పట్టణం లక్ష్మీనగర్కు చెందిన షేక్ హుసేన్ అనే వ్యక్తి తనపొలానికి పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్పుస్తకం కార్యాలయానికి వచ్చి వారం కావస్తున్నా దాన్ని ఇచ్చేందుకు వీఆర్వో ఈడిగ వెంకటేశ్వర్లు జాప్యం చేస్తూ వచ్చాడు. రూ.2500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో షేక్ హుసేన్ కుమారుడు కైజర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం వీఆర్వో వెంకటేశ్వర్లు వెలుగోడు తహసీల్దార్ కార్యాలయంలో ఉండగా.. కైజర్ వెళ్లి రూ.2500 ఇచ్చాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి నేతృత్వంలో ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2500 నగదు, పాస్పుస్తకం స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేశామని, మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల్లో లంచం డిమాండ్ చేస్తుంటే టోల్ఫ్రీ నెంబర్ 14400, కర్నూలు ఏసీబీ డీఎస్పీ 9440446178 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తేజేశ్వరరెడ్డి, ఎన్వీ కృష్ణారెడ్డి, వంశీధర్, ఇంతియాజ్, సిబ్బంది పాల్గొన్నారు.