పెళ్లైన 18 రోజులకే భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య.. అసలు ఆమె అలా ఎందుకు చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-02T06:26:02+05:30 IST

ఒక యువకుడు ఎంతో ఆర్భాటంగా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లిచేసుకోవడానికి గ్రామస్తులందరినీ పిలిచాడు. వివాహం తరువాత కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆ కొత్త పెళ్లికూతురు నెల రోజులు కూడా భర్తతో గడపలేదు...

పెళ్లైన 18 రోజులకే భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య.. అసలు ఆమె అలా ఎందుకు చేసిందంటే..

ఒక యువకుడు ఎంతో ఆర్భాటంగా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లిచేసుకోవడానికి గ్రామస్తులందరినీ పిలిచాడు. వివాహం తరువాత కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆ కొత్త పెళ్లికూతురు నెల రోజులు కూడా భర్తతో గడపలేదు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఆమె ఎటో వెళ్లిపోయింది. ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు. పైగా ఇంట్లో ఉండే డబ్బు, నగలు కూడా లేవు. దీంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జాలోర్ పట్టణంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జాలోర్ పట్టణంలో నివసించే అభిషేక్ జైన్ అనే యువకుడు మనీషా సేన్ అనే పెళ్లిళ్ల ఏజెంట్ ద్వారా సీతా గుప్తా అనే యువతిని కలిశాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి 2022 జనవరి 3న పెళ్లిచేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా అభిషేక్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఏమైందో తెలీదు. సీతా గుప్తా జనవరి 21న భర్త ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళిపోయింది. ఆమెకోసం అభిషేక్ ఎంత వెతికినా కనబడలేదు. ఓపిక నశించి ఇంటి కొచ్చి చూడగా.. అక్కడ ఉండాల్సిన డబ్బు, నగలు కూడా లేవు. దీంతో అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


పోలీసులు విచారణలో భాగంగా.. ముందు పెళ్లిళ్ల ఏజెంట్ మనీషా సేన్‌ కోసం వెళ్లగా.. ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. కానీ పోలీసులు ఆమెను ఫోన్ లొకెషన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఆ తరువాత మనీషాని ప్రశ్నించగా.. ఆమె మొత్తం నిజం చెప్పింది. సీతా గుప్తా ఒక అందమైన మోసగత్తె. డబ్బున్న యువకులను పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత వారి ఇంటి నుంచి డబ్బు దోచుకొని పారిపోవడం ఆమె వృత్తి.


పోలీసులు సీతా గుప్తాను పట్టుకోవడానికి ఒక పథకం వేశారు. ముందు మనీషా సేన్ ద్వారా సీతా గుప్తాకు ఫోన్ చేయించి మరో కొత్త పెళ్లికొడుకు దొరికాడని చెప్పించారు. దీంతో సీతా గుప్తా.. మనీషా సేన్‌ని కలవడానికి వచ్చింది. అప్పుడు పోలీసులు ఆ దొంగ పెళ్లికూతురిని అరెస్టు చేశారు. 


ప్రస్తుతం పోలీసులు సీతా గుప్తా, మనీషా సేన్‌లను ఇంకా ఎంత మందిని మోసం చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు.


Updated Date - 2022-02-02T06:26:02+05:30 IST