అత్తారింటికి వచ్చిన 10 గంటల్లోనే వరుడి కళ్ల ముందే నవవధువు మృతి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-21T18:14:36+05:30 IST

ఆమె ఎంతో సంతోషంగా వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టింది..

అత్తారింటికి వచ్చిన 10 గంటల్లోనే వరుడి కళ్ల ముందే నవవధువు మృతి.. అసలేం జరిగిందంటే..

ఆమె ఎంతో సంతోషంగా వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టింది.. అయితే పెళ్లి జరిగిన పది గంటల్లోనే ఆమె కన్ను మూసింది.. ఊరేగింపు మధ్య అత్తారింటికి చేరుకుని పూజలు చేసిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైంది.. హాస్పిటల్‌కు తీసుకెళ్లేటప్పటికే ప్రాణాలు కోల్పోయింది.. దీంతో అప్పటివరకు సంతోషంతో వెలిగిపోయిన వారు విషాదంలో మునిగిపోయారు. 


రాజస్థాన్‌లోని బేలసర్‌కు చెందిన రేఖకు, తేనా గ్రామానికి చెందిన సుభాష్‌కు బుధవారం తెల్లవారుఝామున 4 గంటలకు వివాహం జరిగింది. వివాహం అనంతరం సుభాష్, రేఖ ఊరేగింపుగా ఇంటికి బయల్దేరారు. అత్తింటి వారు రేఖను ఎంతో ఆదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఉదయం ఆమె చేత ప్రత్యేక పూజలు చేయించారు. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత హఠాత్తుగా రేఖ అనారోగ్యానికి గురైంది. 


చూస్తుండగానే కళ్లు తిరిగి పడిపోయింది. షాకైన కుటుంబ సభ్యులు వెంటనే రేఖను దగ్గర్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేఖ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె అనారోగ్యం ఏమిటనేది ఇంకా బయటకు రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.  

Updated Date - 2022-04-21T18:14:36+05:30 IST