ఫ్రీ బస్‌పాస్‌తో 3500 కిలోమీటర్ల జర్నీ.. ఈ బామ్మ రూటే సపరేటు..!

ABN , First Publish Date - 2021-12-07T01:57:02+05:30 IST

3,500 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కానీ.. బ్రిటన్‌కు చెందిన ఓ బామ్మ మాత్రం ఇవేవీ లేకుండానే ఇంత దూరం ప్రయాణించింది.

ఫ్రీ బస్‌పాస్‌తో 3500 కిలోమీటర్ల జర్నీ.. ఈ బామ్మ రూటే సపరేటు..!

ఇంటర్నెట్ డెస్క్:  3,500 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కానీ.. బ్రిటన్‌కు చెందిన ఓ బామ్మ మాత్రం ఒంటరిగానే ఇంత దూరం ప్రయాణించింది. ఈ క్రమంలో ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇటువంటి రిస్కీ ప్రయాణం చేపట్టిన ఆ వృద్ధ మహిళ పేరు పెన్నీ ఇబ్బట్. ప్రస్తుతం బ్రిటన్ వాసులు పెన్నీ గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. 


పెన్నీ భర్త 2016లో మరణించారు. వెస్ట్ సస్సెక్స్‌లోని సెయింట్ విల్ఫ్రెడ్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే.. అదే ఆస్పత్రికి విరాళాలు సేకరించాలనుకున్న పెన్నీ ఈ సుదీర్ఘ పర్యటనకు పూనుకుంది. 2020లోనే ఈ టూర్ చేపడదామనుకున్నప్పటికీ కరోనా కారణంగా అవాంతరాలు వచ్చాయి. అవన్నీ తొలగిపోయాక పెన్నీ ముందడుగు వేసింది. ఇంగ్లండ్ మొత్తం చుట్టేసింది. మొత్తం ఐదు వారాల ఐదు రోజుల పాటు తన యాత్ర కొనసాగించింది. ఎక్కడి కెళ్లినా బస్సుల్లో వెళ్లాల్సిందే.  కానీ.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అయితే టిక్కెట్టు కొనాలి కాబట్టి సిటీ బస్సుల్లో ప్రయాణం చేసింది. వృద్ధులకు ఇచ్చే ఫ్రీ బస్‌పాస్‌తో సిటీ బస్సుల్లో ఉచితంగా వెళ్లే అవకాశం ఉండటంతో ఈ టూర్‌ను మొత్తాన్ని పెన్నీ బస్‌పాస్ సాయంతో పూర్తి చేసుకుంది. అయితే.. స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నప్పడు ఫ్రీ బస్‌పాస్ చెల్లకపోవడంతో ఓ సారి మాత్రం ఆమె టిక్కెట్టు కొనుక్కోవాల్సి వచ్చింది.


 ‘‘ఈ జర్నిలో ఎంతో మందిని కలిసా.. వాళ్లందరూ నా పట్ల సహృదయత ప్రదర్శించారు. నాకు సహాయం చేశారు. బస్సు ప్రయాణంతో నాకు ఇబ్బంది లేకపోయినప్పటికీ.. రాత్రి సమయాల్లో బస విషయంలో సమస్యలు వచ్చాయి.’’ అని పెన్నీ చెప్పింది. ఈ జర్నీలో ఆమె మొత్తం 120 బస్సుల్లో ప్రయాణించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 6న పెన్నీ ప్రయాణం మొదలై అక్టోబర్ 16న ముగిసింది.  

Updated Date - 2021-12-07T01:57:02+05:30 IST