British PM Election : రుషి సునాక్ సరికొత్త శపథం

ABN , First Publish Date - 2022-08-31T18:37:12+05:30 IST

బ్రిటిష్ ప్రధాన మంత్రి పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం

British PM Election : రుషి సునాక్ సరికొత్త శపథం

లండన్ : బ్రిటిష్ ప్రధాన మంత్రి పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం జరుగుతున్న ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా రుషి సునాక్ (Rishi Sunak) తాజాగా ఓ శపథం చేశారు. బ్రిటన్‌ను ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దేందుకు పగలు, రాత్రి పని చేస్తానని చెప్పారు. బుధవారం సాయంత్రం చివరి ప్రచార కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు ఆయన ఈ శపథం చేశారు. 


బ్రిటిష్ ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న తొలి బ్రిటిష్ ఇండియన్ రుషి సునాక్. బుధవారం సాయంత్రం వెంబ్లీలో తుది ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తన ప్రత్యర్థి లిజ్ ట్రుస్‌ (Liz Truss)తో చివరిసారి తలపడతారు. శుక్రవారం సాయంత్రంతో ఓటింగ్ పూర్తవుతుంది. 


బ్రిటన్‌ను ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కించాలని రుషి సునాక్ తన ప్రచారంలో చెప్తున్నారు. పన్నులను తగ్గిస్తానని తన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. నిలకడ, నిజాయితీ, స్పష్టత గల దార్శనికతతో తాను పని చేస్తానని చెప్తున్నారు. 


రుషి గెలుపు కోసం పని చేస్తున్న రెడీ4రుషి కాంపెయిన్ (Ready4Rishi campaign) టీమ్ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, ప్రపంచంలో అభివృద్ధి చెందగలిగే అత్యుత్తమ దేశం బ్రిటన్ అని తెలిపారు. ఓ కుటుంబాన్ని ప్రారంభించి, వ్యాపారాన్ని నిర్మిస్తే, మన భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పారు. స్వల్ప కాలంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను నిజాయితీతో, విశ్వసనీయతగల ప్రణాళికతో పరిష్కరించగలిగితేనే మనం ఆ స్థాయికి చేరుకోగలుగుతామని తెలిపారు. 


తన దగ్గర సరైన ప్రణాళిక ఉందని, అది కన్జర్వేటివ్ విలువలతో కూడినదని తెలిపారు. మొట్టమొదట మనం తప్పనిసరిగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని తాను ఈ పోటీలో తొలి నుంచీ నిలకడగా, నిజాయితీగా, స్పష్టతతో చెప్తున్నానని వివరించారు. చలికాలంలో ప్రజలకు సహకరించడం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం  ద్వారా మాత్రమే బ్రెగ్జిట్ స్వేచ్ఛ వల్ల కలిగే ప్రయోజనాలను సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతామన్నారు. అది తన దార్శనికత, బ్రిటన్ కోసం తన కల అని తెలిపారు. తాను ఎంతో ప్రేమించే దేశం, పార్టీల కోసం ఈ దార్శనికతను వాస్తవం చేయడానికి తాను పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తానని శపథం చేశారు. 


స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. ఓటు వేయడానికి 1,60,000 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు అర్హులు. ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటిస్తారు. 


Updated Date - 2022-08-31T18:37:12+05:30 IST