రోడ్డెక్కిన బ్రాయిలర్ కోళ్ల రైతులు
ABN , First Publish Date - 2022-07-07T06:22:00+05:30 IST
గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ బ్రాయిలర్ కోళ్ల పెంపకందారులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
కార్పొరేట్ కంపెనీల తీరుపై ఆగ్రహం
కిలోకు రూ.12 చొప్పున చెల్లించాలని డిమాండ్
లేదంటే కోళ్ల పెంపకం ఆపేస్తామని హెచ్చరిక
గొలుగొండ/నర్సీపట్నం అర్బన్, జూలై 6: గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ బ్రాయిలర్ కోళ్ల పెంపకందారులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కోళ్ల ఫారాల నిర్వహణ వ్యయం నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ కార్పొరేట్ కంపెనీలు బ్రాయిలర్ కోళ్లకు ధర పెంచడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీ కోళ్ల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.బుల్లబ్బాయి మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బ్రాయిలర్ కోళ్ల యాజమాన్యాలు ఫారాల రైతులకు కిలోకు రూ.12 చొప్పున చెల్లించాలని, నాణ్యమైన కోడి పిల్లలను అందించాలన్నారు. లేదంటే ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని ఆపేస్తామని చెప్పారు. అనంతరం పలు డిమాండ్లతో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అంతకుముందు స్థానిక వెంకటేశ్వర హేచరీస్ కార్యాలయం వద్ద కోడి పిల్లల వ్యాన్ను అడ్డగించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కోడి పిల్లల వ్యాన్ను హెచరీస్ కార్యాలయం సిబ్బందికి అప్పగించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతుండగా పట్టణ ఎస్ఐ దివాకర్ అడ్డుకున్నారు. తరువాత పెదబొడ్డేపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఉమాశంకర్ గణేశ్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాది వరహాలబాబు, రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పెట్ల అక్కునాయుడు, జిల్లా నాయకులు కర్రి నాయుడు, తలారి గంగాధర్, రోలుగుంట, గొలుగొండ, రావికమతం, కోటవురట్ల, నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, కోటనందూరు మండలాలకు చెందిన కోళ్ల పెంపకందారులు పాల్గొన్నారు.