Madanapalle : పట్టపగలే.. గంటల వ్యవధిలో మూడు చోట్ల ముగ్గురిపై కొడవళ్లతో Brothers దాడి..
ABN , First Publish Date - 2021-08-23T12:30:15+05:30 IST
ఇద్దరు సోదరులు రెచ్చిపోయారు. గంటలో మూడు చోట్ల ముగ్గురిపై
- పట్టపగలే రెచ్చిపోయిన సోదరులు
- కొడవలితో ముగ్గురిపై హత్యాయత్నం
- ఒకరి పరిస్థితి విషమం.. తిరుపతికి రెఫర్
చిత్తూరు జిల్లా/మదనపల్లె క్రైం : ఇద్దరు సోదరులు రెచ్చిపోయారు. గంటలో మూడు చోట్ల ముగ్గురిపై కొడవళ్లతో దాడి చేశారు. మదనపల్లెలో ఆదివారం జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. టూటౌన్ సీఐ నరసింహులు తెలిపిన మేరకు.. పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన వ్యాపారి టి.ప్రసాద్.. ఆరునెలల కిందట తన స్నేహితుడి వద్ద పూచీపడి నిమ్మనపల్లెక్రాస్కు చెందిన రాజేష్కు రూ.2 లక్షలు అప్పుగా తీసిచ్చారు. అసలు, వడ్డీ చెల్లించ కపోవడంతో రాజేష్పై ఒత్తిడి తేవంతో మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో రాజేష్ ఆదివారం ప్రసాద్కు ఫోన్చేసి అప్పు మొత్తం చెల్లిస్తానని, తన ఇంటికి రావాలన్నారు. అయితే తన ఇంటికే రమ్మని ప్రసాద్ చెప్పారు. దీంతో తన తమ్ముడు రానాతో కలిసి రాజేష్ కృష్ణానగర్కు వచ్చారు. అక్కడ ప్రసాద్తో గొడవపెట్టుకుని తమతో తెచ్చుకున్న కొడవలితో దాడి చేశారు.
- శేష్మహల్ ఏరియాలో మోహన్బాబు(38)తో గొడవపడి కొడవలితో గాయపడిచారు. ఇటీవల దివ్యాంగుడైన మోహన్బాబును రాజేష్ కించపరిచేలా మాట్లాడడంతో వారిమధ్య గొడవ జరిగింది. దీంతో ఈ కక్ష పెంచుకుని దాడి చేశారు.
- నిమ్మనపల్లె సర్కిల్లో సప్లయర్స్ దుకాణ నిర్వాహకుడు శివయ్య(48)ను షాపు నుంచి బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో దాడి చేశారు. శివయ్య రెండురోజుల కిందట రాజేష్ తండ్రి రవిని ఒరేయ్ అని సంబోధించడంతో ఈ దాడికి పాల్పడ్డారు.
ఇలా గంట వ్యవధిలో మదనపల్లెలో మూడు ఘటనలు జరగడంతో వన్టౌన్, టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వారి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. బాధితుల్లో శివయ్య పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఈక్రమంలో టూటౌన్ పరిధిలో ఒకటి, వన్టౌన్ పరిధిలో రెండు ఘటనలపై కేసు నమోదు చేసినట్లు సీఐలు ఈదురుబాషా, నరసింహులు చెప్పారు.