కంకర పోశారు.. బీటీ మరిచారు
ABN , First Publish Date - 2021-02-23T04:06:22+05:30 IST
కంకర పోశారు.. బీటీ మరిచారు
- అసంపూర్తిగా కడ్తాల-కొండ్రిగానిబోడు తండా రోడ్డు
- ఏడాది క్రితం మెటల్ వేసినా నేటికీ చేపట్టని బీటీ నిర్మాణం
- అవస్థలు పడుతున్న వాహనదారులు
ఆమనగల్లు : కడ్తాల నుంచి కొండ్రిగానిబోడు తండా, పెద్దిరెడ్డి చెరువు తండా మీదుగా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. పనుల పూర్తిచేసే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ చొరవ చూపడం లేదని ఆయా తండాల గిరిజనులు వాపోతున్నారు. కంకర పోసి వదిలేసిన రోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటీ నిర్మాణం చేపట్టాలని ఆందోళనలు చేసినా స్పందన లేదు. రెండేళ్ల క్రితం మూడు తండాలకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.75కోట్లు మంజూరు చేసింది. ఏడాదిన్నర క్రితం బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. మూడు తండాలకు వేళ్లే రోడ్లపై కంకర పోశారు. కాగా మంజూరైన నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాక పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు. దీంతో ఏడాది కాలంగా మూడు తండాల ప్రజలు, వాహనదారులు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని అసంపూర్తి బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించాలని ఆయా తండాల ప్రజలు కోరుతున్నారు.