Ayyanna మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే: Buddha Venkanna
ABN , First Publish Date - 2022-06-19T16:22:45+05:30 IST
జగన్ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.
Vijayawada: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) బీసీలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu) మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. ప్రభుత్వం తప్పులను ప్రశ్నించకూడదా? అని ప్రశ్నించారు. గతంలో కమ్మవారిని లక్ష్యంగా చేసుకుని వేధించారని, ఇప్పుడు బీసీలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని విమర్శించారు. వైసీపీ నేతలు చేపట్టిన బీసీ యాత్రను ప్రజలు తిరస్కరించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రకు విశేష స్పందన వచ్చిందని, ఈ పరిణామాలతో జగన్లో వణకు మొదలైందన్నారు. అందుకే అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టిస్తున్నారని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలను డీజీపీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవన్నారు.
‘జగన్ పోవాలి.. చంద్రబాబు రావాలి’ అని ప్రజలు నినదిస్తున్నారని, అందుకే టీడీపీ నేతలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఏ2 విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఏదో కూస్తున్నారని, చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముసలోడా... ఆయనతో యోగాసనాలు వేయగలరా? అంటూ సవాల్ చేశారు. వైసీపీ కపట నాటకాలు ప్రజలకు అర్ధమయ్యాయని, మూడేళ్లుగా ఆడిన డ్రామాలు చాలని, ఈసారి వైసీపీకి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. భవిష్యత్తులో ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని, గుర్తు పెట్టుకోవాలన్నారు. వైసీపీ తొత్తులుగా పని చేస్తున్న అధికారులపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా... ప్రజల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందని, తగ్గే ప్రసక్తే లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.