సినీ పరిశ్రమను నాశనం చేయడం దుర్మార్గం: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2021-12-23T20:41:42+05:30 IST
సినిమా హీరోలను దెబ్బకొట్టాలని.. ఆ పరిశ్రమను నాశనం చేయడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.
విజయవాడ: సినిమా హీరోలను దెబ్బకొట్టాలని.. ఆ పరిశ్రమను నాశనం చేయడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. గురువారం సెమీ క్రిస్మస్ వేడుకల్లో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా పాల్గొన్నారు. ఈసందర్భంగా బుద్దావెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారు సీఎం జగన్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సినిమా వారి నుంచి కమీషన్లు రావడం లేదనే జగన్ కక్ష కట్టారని ధ్వజమెత్తారు. థియేటర్ల మీదకి అధికారులను దండయాత్రగా పంపిస్తున్నారని మండిపడ్డారు.
ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ ప్రజల జీవితాలను తారుమారు చేశారన్నారు. విజయనగరంలో అశోక గజపతి రాజుపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వేల ఎకరాలను దానం చేసిన వ్యక్తిని... దోచుకున్నవాళ్లు అవమానిస్తున్నారని మండిపడ్డారు.పేట్రేగిపోతున్న మంత్రుల తాట తీసే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరించారు.విజయనగరం ప్రజలంతా ఏకమై మంత్రులకు బుద్ధి చెప్పాలన్నారు. అశోక గజపతిరాజును కనీసం విమర్శించే స్థాయి కూడా వాళ్లకు లేదని చెప్పారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. సినిమా టికెట్ల అంశమే ఈ ప్రభుత్వానికి ప్రధాన సమస్య అని చెప్పారు. ప్రజలు అడిగిన హామీలను తీర్చకుండా రాజకీయ స్వలాభం కోసమే జగన్ పని చేస్తున్నారని దుయ్యబట్టారు.క్రిస్మస్ పండుగను అందరూ ఉత్సాహంతో జరుపుకోవాలని బుద్దావెంకన్న తెలిపారు.