బ్యూటీ క్లినిక్ నిర్వాహకురాలికి రైజా నోటీసులు
ABN , First Publish Date - 2021-04-23T16:57:16+05:30 IST
బ్యూటిక్యూ చికిత్స వికటించడంతో సినీ నటి రైజా విల్సన్ కోటి రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ బ్యూటీపార్లర్ ఓనర్కు లీగల్ నోటీసు పంపించారు. మోడ
- రూ.కోటి పరిహారం డిమాండ్
అడయార్(చెన్నై): బ్యూటిక్యూ చికిత్స వికటించడంతో సినీ నటి రైజా విల్సన్ కోటి రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ బ్యూటీపార్లర్ ఓనర్కు లీగల్ నోటీసు పంపించారు. మోడల్ నుంచి నటిగా మారిన రైజా విల్సన్.. ‘ప్యార్ ప్రేమ కాదల్ ’ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మోడలింగ్ రంగంలోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం అళ్వార్పేటలో ఓ బ్యూటి క్లినిక్లో ఫేషియల్ చేయించుకున్నారు. చర్మం మరింత కాంతిగా ఉండేందుకు చర్మ చికిత్స చేయించుకోగా అది వికటించి కుడి కన్ను కిందిభాగం వాచిపోయింది. ఈ చికిత్సను చర్మ సౌందర్య నిపుణురాలు డాక్టర్ భైరవి చేశారని, ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటూ రైజా విల్సన్ వాపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని, లేనిపక్షంలో కోర్టులో కేసు వేస్తానంటూ రైజా విల్సన్ నోటీసులు పంపించారు. తనకు జరిగిన నష్టాన్ని 15 రోజుల్లో పూడ్చకుంటే కేసు పెడతానని డాక్టర్ భైరవికి రైజా విల్సన్ పంపించిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై భైరవి సెంథిల్ వివరణ ఇస్తూ. ఇరువైపుల ముఖం హెచ్చుతగ్గులుగా ఉండటంతో దాన్ని సరిచేసేందుకు డెర్మల్ పిల్లర్స్ అనే చికిత్స చేశానని, ఇదే తరహా చికిత్సన గతంలో రైజాకు చేసానని, ఇలాంటి చికిత్స తర్వాత ఒక వారం రోజుల పాటు ముఖం వాపు ఉంటుందని, అయితే, నష్టపరిహారం కోరుతూ ఆమె బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.