నిర్వాసితులకు నాణ్యమైన ఇళ్లు కట్టించాలి
ABN , First Publish Date - 2021-07-24T05:25:04+05:30 IST
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
సీపీఎం నాయకుల డిమాండ్
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
గజ్వేల్, జూలై 23: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో విజయేందర్రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ.. నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు వర్షాలకు కూలిపోతున్నాయని, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఇంటి పైకప్పులు తడిసి పెచ్చులూడుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్, సూపర్వైజర్కు తెలపడానికి ప్రయత్నించినా హిందీ వాళ్లు కావడంతో భాషాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తాత్కాలిక అవసరాలను తీర్చేందుకు ఇంజనీర్లు ఉన్నారని, ఉపాధి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో విజయేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు యాదగిరి, నవీన్, రాజు, మల్లయ్య, లక్ష్మి, బాలవ్వ, వేములఘట్టువాసులు పాల్గొన్నారు.