ఆ భార్యభర్తల కోసం ఆరేళ్లుగా వెతుకుతున్న పోలీసులు.. ఇంతకీ వారు చేసిన పనేంటంటే..
ABN , First Publish Date - 2022-05-29T21:30:35+05:30 IST
హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన `బంటీ ఔర్ బబ్లీ` సినిమా చూశారా?
హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన `బంటీ ఔర్ బబ్లీ` సినిమా చూశారా? ఆ సినిమాలో హీరోహీరోయిన్లు జంటగా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతుంటారు. అచ్చం అలాగే రాజస్థాన్ కు చెందిన ఓ జంట కూడా పలువురిని తమ తెలివి తేటలతో మోసగించి తప్పించుకుని తిరుగుతోంది. వారి కోసం ఆరేళ్లుగా వెతుకుతున్న పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరిపై జోధ్పూర్, జైపూర్, గంగానగర్, పూనాలలో కేసులు నమోదయ్యాయి.
గుజరాత్లోని వడోదరకు చెందిన ఈ జంట రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడ్డారు. వీరు పలు ఫేక్ కంపెనీలు సృష్టించి పలువురు ప్రముఖుల చేత పెట్టుబడులు పెట్టించారు. తర్వాత ఆ ఊరి నుంచి పరారయ్యేవారు. అలాగే అద్దెకు తీసుకొచ్చిన కారును మరొకరికి అమ్మేసి ఆ డబ్బులతో పరారయ్యారు. ఇక, గంగాపూర్ లో షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్లమని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. బాధితులందరూ కేసులు పెట్టడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే నిందితులు తమ పేర్లు మార్చుకుని తిరుగుతుండడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది.
వీరిద్దరూ స్వయంగా ఆధార్ కార్డులను కూడా తయారు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఇద్దరూ పరారయ్యారు. నిందితులు తమ కుటుంబీకులు, బంధువులతో టచ్లో ఉన్నప్పటికీ పట్టుబడతామనే భయంతో తరచూ స్థలాలు మార్చేవారు. చివరకు ఆరేళ్ల తర్వాత పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు.