శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం
ABN , First Publish Date - 2021-07-26T08:29:24+05:30 IST
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీటీడీ ఫిర్యాదుతో ట్రావెల్స్పై కేసు నమోదు
తిరుమల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని టీటీడీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో చెన్నైకు చెందిన రేవతి ట్రావెల్స్.. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ దృష్టికి వచ్చింది. ఆ సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేయగా, కేసు నమోదు చేశారు. కాగా, శ్రీవారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా ప్రతి నెలా 20వ తేదీన ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్లో విడుదల చేస్తున్నామని.. దళారులను నమ్మి నష్టపోవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. స్వామి దర్శనం, సేవా టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.