
కరోనా సాకుతో వ్యాపారసంస్థలు అధిక రాయితీలు పొందడానికి వీల్లేదని స్పష్టం చేసింది బాంబే హైకోర్టు. ముంబైకు చెందిన హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా సందర్భంగా వ్యాపార సంస్థలపై దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వర్కింగ్ అవర్స్ తగ్గించారు. ఈ ప్రభావంతో చాలా సంస్థల వ్యాపారం దెబ్బతింది. ఈ నేపథ్యంలో బార్స్, రెస్టారెంట్స్, హోటల్స్ కూడా తీవ్రంగా నష్టపోయాయి. సాధారణంగా వీటిలో మద్యం అమ్మేందుకు ఉదయం పదకొండున్నర నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర వరకు అనుమతి ఉంటుంది. అయితే, కరోనా సందర్భంగా ఈ టైమ్ తగ్గించింది ప్రభుత్వం. దీంతో తాము నష్టపోయామని, అందువల్ల లైసెన్స్ ఫీజులో యాభై శాతం రాయితీ కావాలని కోరుతూ హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. వ్యాపార సంస్థలు కరోనా పేరుతో మితిమీరిన రాయితీలు పొందరాదని చెప్పింది. కరోనా సందర్భంగా అందరూ నష్టపోయారని, ఈ విషయంలో ప్రభుత్వ తప్పులేదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ కొట్టివేసిన కోర్టు, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు రూ.9 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.