ఉప ఎన్నికలు... ఆసక్తికర ఫలితాలు...
ABN , First Publish Date - 2021-11-02T22:35:34+05:30 IST
దేశంలోని మూడు లోక్సభ, 29 శాసన సభ స్థానాలకు
న్యూఢిల్లీ : దేశంలోని మూడు లోక్సభ, 29 శాసన సభ స్థానాలకు అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 13 రాష్ట్రాలు, దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్లో నాలుగు, మధ్య ప్రదేశ్లో 3, హిమాచల్ ప్రదేశ్లో 3, మేఘాలయలో 3, బిహార్లో 2, కర్ణాటకలో 2, రాజస్థాన్లో 2, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణాలలో ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రా అండ్ నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి, మధ్య ప్రదేశ్లోని ఖండ్వా లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలనుబట్టి అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల నమ్మకం దాదాపు కొనసాగుతోందని చెప్పవచ్చు. తెలంగాణా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం అధికార పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది.
పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు శాసన సభ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమదే విజయమని ముందుగానే ప్రకటించేసి, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 294 స్థానాలున్న శాసన సభలో 213 స్థానాలను కైవలం చేసుకుని విజయ దుందుభి మ్రోగించింది. బీజేపీ 77 స్థానాలతో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఉప ఎన్నికల్లో కూడా టీఎంసీ అదే హవాను కొనసాగించింది.
అస్సాంలో ఐదు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. భబానీపూర్లో 25 వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఫణిధర్ తాలూక్దార్ విజయం సాధించారు. మరియానీలో రూప్జ్యోతి కుర్మి(బీజేపీ), తౌరాలో సుశాంత బోర్గోహెయిన్ (బీజేపీ) కూడా గెలిచే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ మిత్ర పక్షం యూపీపీఎల్ అభ్యర్థులు జిరోన్ బసుమటరీ, జోలెన్ డైమరీ కూడా ఈ ఉప ఎన్నికల్లో విజయం దిశగా పయనిస్తున్నారు. బసుమటరీ తన సమీప ప్రత్యర్థిపై 22 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. డైమరీ తన సమీప ప్రత్యర్థి కన్నా 24 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలనుబట్టి ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రజలు మరోసారి మద్దతు పలికారని చెప్పవచ్చు.
కర్ణాటకలో సింధగి, హనగల్ శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరొక స్థానంలోనూ ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి. హనగల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, సింధగిలో అధికార పార్టీ బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ప్రజలు ఇరు పార్టీలను సమానంగా ఆదరిస్తున్నారనుకోవచ్చు.
బిహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ చెరొక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. తారాపూర్లో ఆర్జేడీ, ఖుషేశ్వర్ ఆస్థాన్లో జేడీయూ ముందంజలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఖుషేశ్వర్ ఆస్థాన్లో జేడీయూ అభ్యర్థి అమన్ భూషణ్ హజారీకి 59,882 ఓట్లు లభించగా, ఆర్జేడీ అభ్యర్థి గణేశ్ భారత్కు 47,184 ఓట్లు లభించాయి, ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హర్యానాలో ఐఎన్ఎల్డీ సెక్రటరీ జనరల్ అభయ్ సింగ్ చౌతాలా ఎల్లనబాద్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార బీజేపీకి షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ అభయ్ రాజీనామా చేసి, మళ్ళీ పోటీ చేశారు. ఆయన గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. మండి లోక్సభ నియోజకవర్గంలోనూ, మూడు శాసన సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
మధ్య ప్రదేశ్లో జరిగిన లోక్సభ, శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఖండ్వా లోక్సభ నియోజకవర్గంలో తాము (బీజేపీ) ముందంజలో ఉన్నామని, జోబట్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యమైనవిగా తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ రాష్ట్రంలో రాయ్గావ్, పృథ్వీపూర్, జోబట్ శాసన సభ నియోజకవర్గాలకు, ఖండ్వా లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. జోబట్లో బీజేపీ అభ్యర్థి సులోచన 5 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాయ్గావ్, పృథ్వీపూర్లలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా కనిపించింది.
రాజస్థాన్లో ధరియావాద్, వల్లభ్ నగర్ శాసన సభ నియోజకవర్గాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ అభ్యర్థుల కన్నా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు మద్దతిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మీడియాకు తెలిపారు.
మహారాష్ట్రలో అధికార కూటమిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జితేష్ రావ్ సాహెబ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సుభాష్పై ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది.
మిజోరాంలోని ట్విరియల్ శాసన సభ నియోజకవర్గంలో అధికార ఎంఎన్ఎఫ్ అభ్యర్థి కే లాల్డాంగ్లియానా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, జోరం పీపుల్స్ మువ్మెంట్ పార్టీ అభ్యర్థి లాల్ట్లన్మవియాను ఓడించారు.
మేఘాలయలోని మారింగ్క్నెంగ్ శాసన సభ నియోజకవర్గంలో అధికార పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అభ్యర్థి పినియయిద్ సిన్హ్ సియియెమ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హైలాండర్ ఖర్మల్కిపై ఆధిక్యంలో ఉన్నారు. రాజబలలో ఎన్పీపీ అభ్యర్థి అబ్దుస్ సలేహ్ కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మాఫలాంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్సభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి కాలాబెన్ డేల్కర్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో తాము ఢిల్లీ అధికార పీఠం దిశగా పెద్ద ముందడుగు వేశామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్లోని బద్వేలు శాసన సభ నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయం సాధించారు.