సేవా సైనికులు

ABN , First Publish Date - 2020-11-08T08:17:57+05:30 IST

అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రౌడీమూకలు..

సేవా సైనికులు

విజయవాడ(ఆంధ్రజ్యోతి): అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రౌడీమూకలు అతడి కుటుంబంపై కక్ష కడతాయి. అతడి తల్లి, చెల్లిని కళ్లెదుటే దారుణంగా చంపేస్తాయి. అప్పటివరకు అధ్యాపకుడిగా ఉన్న అతడు రాత్రిపూట మాత్రం అరాచకశక్తుల ఆట కట్టించడానికి కంకణం కట్టుకుంటాడు. ఊరు, పేరు, స్వరూపం తెలియని అతడ్ని ప్రజలంతా రాబిన్‌హుడ్‌గా కొలుస్తారు. ‘న్యాయం మీరే చెప్పాలి’ చిత్ర కథాంశం ఇది. నాడు రాబిన్‌హుడ్‌ ధనవంతులను కొల్లగొట్టి పేదలకు పంచడంతో హీరో అయ్యాడు. ఇప్పుడు పేదల ఆకలిని తీర్చడానికి రియల్‌ రాబిన్‌హుడ్స్‌ విజయవాడలో పుట్టుకొచ్చారు. ‘రాబిన్‌హుడ్‌ ఆర్మీ’ పేరుతో సైన్యంగా తయారయ్యారు. ఆకలి లేని సమాజం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆర్‌హెచ్‌ఏ (రాబిన్‌హుడ్‌ ఆర్మీ)పై ప్రత్యేక కథనం. 


 రాబిన్‌హుడ్‌ ఆర్మీకి వ్యవస్థాపకుడు ఢిల్లీకి చెందిన నీలోఘోష్‌. ఆయన పోర్చుగీసులో జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబిన్‌హుడ్‌ను ఏర్పాటు చేశారు. పోర్చుగీసులో రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు ఉచితంగా అందజేస్తారు. ఇందుకోసం లక్షలాది మంది సైన్యంలా పనిచేస్తారు. దీన్ని భారత్‌లో ఎందుకు అమలు చేయకూడదన్న ఆలోచన నీలోఘోష్‌కు వచ్చింది. ఫలితంగా 2014, ఆగస్టు 26న ఢిల్లీలో ఐదుగురితో రాబిన్‌హుడ్‌ ఆర్మీ ప్రారంభమైంది. ఇలా పుట్టుకొచ్చిన ఆర్‌హెచ్‌ఏ అనతికాలంలోనే విదేశాలకు విస్తరించింది. 


బెజవాడలో బీజం పడింది ఇలా..

ఆర్‌హెచ్‌ఏ విజయవాడ చాప్టర్‌ రెండేళ్ల క్రితం మొదలైంది. వలంటీర్లుగా పనిచేయడానికి యువకులు, విద్యార్థులు, మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగులు రాబిన్‌హుడ్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 200 మంది వలంటీర్లు ఇందులో పేర్లను నమోదు చేసుకున్నారు. లాక్‌డౌన్‌, వరదల సమయంలో పేదల ఆకలిని తీర్చిన రాబిన్‌హుడ్‌ తాజాగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో అనుబంధం ఏర్పరచుకుంది. వారంలో మూడు రోజులు అక్షయపాత్ర ఫౌండేషన్‌, ఆర్‌హెచ్‌ఏకు ఆహారాన్ని సరఫరా చేస్తోంది. దాన్ని ఆర్‌హెచ్‌ఏ పేదలకు పంపిణీ చేస్తోంది.


ఇందులో సేవలందించే వలంటీర్లను రాబిన్స్‌గా పిలుస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వారి స్నేహితులను గెస్ట్‌ రాబిన్స్‌గా వ్యవహరిస్తారు. విజయవాడ నగరాన్ని నాలుగైదు క్లస్టర్లుగా విభజించుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆర్‌హెచ్‌ఏ పేరుతో వాట్సాప్‌ గ్రూపును పెట్టుకుని ఎక్కడ ఆహారం అవసరమో తెలుసుకుంటారు. దాని ప్రకారం ఆహార ప్యాకెట్లను పేదల చెంతకు చేరుస్తున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథా కాకుండా చేస్తూ, పేదల ఆకలిని తీర్చాలన్నది ఆర్‌హెచ్‌ఏ ఆశయం. అందుకోసం నగరంలో అన్ని కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఆహారం మిగిలిపోయినా ఆర్‌హెచ్‌ఏకు సమాచారం వెళ్తుంది. రాబిన్స్‌ వెళ్లి దాన్ని ప్యాక్‌ చేసి పేదలకు అందజేస్తారు. ఆర్‌హెచ్‌ఏ నగదు రూపంలో ఎలాంటి విరాళాలను స్వీకరించదు. సేవను మాత్రమే స్వీకరిస్తుంది. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఇవ్వాలనుకున్న వారు 9908473425 నెంబర్‌లో సంప్రదించాలని రాబిన్స్‌ కోరారు.


రాబిన్‌హుడ్‌ అకాడమీ

మురికివాడల్లోని పేదల ఆకలి తీర్చడంతోపాటు విద్యకు దూరంగా ఉన్న పిల్లలకు చదువు చెప్పాలన్నది రాబిన్స్‌ రెండో లక్ష్యం. రాబిన్‌హుడ్‌ అకాడమీ పేరుతో ఆయా క్లస్టర్లలో వారాంతపు తరగతులను నిర్వహిస్తున్నారు. కృష్ణలంక, రాణిగారితోట, ఆటోనగర్‌ వంటి ప్రాంతాల్లో బడికి దూరంగా ఉన్న చిన్నారులను గుర్తించారు. వారికోసం కొంతమంది రాబిన్స్‌ అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా తర్ఫీదును ఇస్తున్నారు. 


ఆకలిపైనే యుద్ధం.. మీనన్‌, సిటీ లీడ్‌

ఆకలి కేకలు లేని సమాజం తయారు కావాలన్నది మా తపన. అందుకోసం కులమతాలకు అతీతంగా పనిచేస్తాం. అందుకే ఆకలిపైనే యుద్ధం చేయాలని భావించాం. మాకు విరాళాలు అవసరం లేదు. సేవ చేయడానికి మాతో చేతులు కలిపితే చాలు. 


ఆకలికి సరిహద్దులు లేవు.. శ్రీనివాస్‌, రాబిన్స్‌ కో-ఆర్డినేటర్‌

రాబిన్‌హుడ్‌ ఆర్మీ మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సేవలందిస్తోంది. పేదల ఆకలిని తీర్చడం, పేద విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించడమే కాకుండా మా వద్ద మరికొన్ని సేవలకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. 

Updated Date - 2020-11-08T08:17:57+05:30 IST