విద్యుత్ సౌధలో ఉద్రిక్తం
ABN , First Publish Date - 2020-11-13T11:27:07+05:30 IST
డిమాండ్లను పరిష్కరించాలనే ఆందోళన ఒక వైపు. ఆందోళనకారుల అరెస్టు మరో వైపు... వెరసి గుణదలలోని విద్యుత్ సౌధ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది
పోలీసుల వలయంలో ప్రాంగణం
12 మంది ఉద్యోగుల అరెస్టు
విజయవాడ/గుణదల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : డిమాండ్లను పరిష్కరించాలనే ఆందోళన ఒక వైపు. ఆందోళనకారుల అరెస్టు మరో వైపు... వెరసి గుణదలలోని విద్యుత్ సౌధ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళన ఒక్కసారిగా వేడెక్కింది. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి డిమాండ్లతో విద్యుత్ శాఖలోని వివిధ సంఘాలు జేఏసీగా ఏర్పడి నాలుగు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు విద్యుత్సౌధ లోపల ఆందోళన చేయగా, మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగులు, అధికారులు బయటకు వచ్చి అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల విడుదలపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో విధులను బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. మరోపక్క సూర్యారావుపేటలోని సీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు. సీఎండీ జె.పద్మజనార్థన్రెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సంతృప్తి చెందని జేఏసీ నాయకత్వం.. అరెస్టు చేసిన వారిని విడుదల చేసేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. విద్యుత్ సౌధ వద్దకు ఉద్యోగులు భారీ సంఖ్యలో రావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా ఆందోళన కారులు వెనక్కి తగ్గలేదు. అరెస్టు చేసిన ఉద్యోగులను రాత్రికి పోలీస్స్టేషన్ నుంచి విడుదల చేశారు. అక్కడి నుంచి ఉద్యోగులంతా ర్యాలీగా విద్యుత్ సౌధ వద్దకు చేరుకున్నారు.