రెచ్చిపోతున్న కేబుల్ దొంగలు
ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST
రెచ్చిపోతున్న కేబుల్ దొంగలు
బొంరాస్పేట్: కేబుల్ వైర్ దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. రైతులు తమ పొలాల దగ్గర నీటిని తోడేందుకు మోటార్లకు బిగించిన కేబుల్ను అందినకాడికి తీసుకుని వెళ్తున్నారు. గతంలో బొంరాస్పేట్ మండల పరిధిలోని మహంతీపూర్, జానకంపల్లి, బొంరాస్పేట్, దుప్చర్ల, ముద్దాయిపేట్, మెట్లకుంట గ్రామాల్లో రైతుల మోటార్ల నుంచి కేబుల్ వైర్లను దొంగించిన సంఘటన కలకలం రేపింది. అప్పట్లోపోలీసులు దొంగలను పట్టుకోవడంతో కాస్త సద్దుమణిగింది. తుంకిమెట్ల తదితర ప్రాంతాల్లో స్ర్కాబ్ కొనుగోలు చేసే వారికి హెచ్చరికలు చేయడంతో దొంగతనాలకు బ్రేక్ పడింది. మళ్లీ రెండు రోజులుగా బొంరాస్పేట్లోని కాకరవాణి వాగులో మోటార్ల నుంచి తరచూగా కేబుల్ వైర్లను దొంగిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. బొంరాస్పేట్ గ్రామానికి చెందిన సికిందర్, హన్మయ్య, లక్ష్మయ్య, బాలయ్య తదితర రైతుల వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్లను దొంగిలించి శివారు ప్రాంతంలో అందులోని తీగలను తీసుకొని మిగతా వైర్లను పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన రైతులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు గట్టి నిఘా ఉంచి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవాలని కోరుతున్నారు.