AIADMKలో సంక్షోభం మరింత తీవ్రం.. OPS పోస్టర్‌ను చింపివేసిన క్యాడర్

ABN , First Publish Date - 2022-06-28T00:40:27+05:30 IST

అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఏక నాయకత్వం అనే అంశంపై ఓ.పన్నీర్‌సెల్వం (OPS), ఎడప్పాడి కె పన్నీర్ సెల్వం (EPS) మధ్య..

AIADMKలో సంక్షోభం మరింత తీవ్రం.. OPS పోస్టర్‌ను చింపివేసిన క్యాడర్

చెన్నై: అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఏక నాయకత్వం అనే అంశంపై  ఓ.పన్నీర్‌సెల్వం (OPS), ఎడప్పాడి కె పన్నీర్ సెల్వం (EPS) మధ్య చిచ్చు రేగిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ల సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. అన్నాడీఎంకే అఫీస్ బేరర్ల సమావేశానికి ముఖ్యమంత్రి ఈపీఎస్, పార్టీ నేతలు హాజరు కాగా, పార్టీ కార్యాలయం లోపల ఏర్పాటు చేసిన బోర్డుపై ఉన్న ఓపీఎస్ ఫోటోను కొందరు తొలగించారు. ఇదే తరహా ఘటన పొరుగున ఉన్న పాండిచ్చేరిలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కూడా చోటుచేసుకుంది.


అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తొలగిస్తారనే ఊహాగానాల మధ్య ఆఫీస్ బేరర్ల సమావేశం జరగడంతో ఉత్కంఠ నెలకొంది. దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ, చాలా నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోవచ్చుననీ, అయితే జూలై 11న ఏర్పాటు చేసే జనరల్ కౌన్సిల్ సమావేశంలో మాత్రమే వాటిని వెల్లడించడం జరుగుతుందని చెప్పారు. ''వంచనకు మారుపేరు ఓపీఎస్'' అని ఆయన విమర్శించారు. పార్టీ పత్రిక ''నముదు అమ్మ'' నుంచి ఓపీఎస్ పేరును తొలగించడంపై మాట్లాడుతూ, ఇంకెంతమాత్రం ఆయన పేరు కొనసాగించడం ఉండదని చెప్పారు.


అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ల సమావేశంపై జయకుమార్ మాట్లాడుతూ...''ప్రస్తుత డిప్యూటీ, జాయింట్ కోఆర్డినేటర్ల పదవీకాలం ముగిసింది. ప్రధాన కార్యాలయ ఫంక్షనరీల విజ్ఞప్తి మేరకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ తమిళమగన్ హుస్సేన్ సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేశాం. మొత్తం 74 మంది హెడ్‌క్వార్టర్స్ సభ్యుల్లో 65 మంది ఇవాళ హాజరయ్యారు. సభ్యులతో చర్చ అనంతరం సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు'' అని అన్నారు.


ఓపీఎస్‌పై విసుర్లు...

తాను పార్టీ కోఆర్డినేటర్ అయినందున తన ఆమోదం లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ బైలాస్ (party bylaws)ను ఉల్లంఘించడమేనని ఓపీఎస్ చేసిన వ్యాఖ్యలను జయకుమార్ కొట్టివేశారు. న్యాయశాఖ మాజీ మంత్రి సి.వీ.షణ్ముగం దీనిపై ఏమి చెప్పారో ఓపీఎస్ జాగ్రత్తగా వినాలని అన్నారు. పార్టీ బైలాస్‌లోని 20A (VII) ప్రకారం, కోఆర్డినేటర్లు అందుబాటులో లేనప్పుడు (పరోక్షంలో) హెడ్‌క్వార్డర్స్ ఫంక్షనరీలకు పార్టీని లీడ్ చేసే హక్కు ఉంటుందని షణ్ముగం చాలా స్పష్టంగా చెప్పారని జయకుమార్ వివరించారు. హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా ఈపీఎస్ ఉన్నారనీ, తమ అందరి అభ్యర్థన మేరకు హెడ్‌క్వార్టర్స్ ఫంక్షనరీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీనిపై అవగాహన లేకుండా ఓపీఎస్ మాట్లాడుతున్నారని అన్నారు. ''నిద్రపోతున్న వారిని లేపగలమే కానీ  నిద్ర నటిస్తున్న వారిని లేపలేం'' అని ఓపీఎస్‌పై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-06-28T00:40:27+05:30 IST