ఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదిక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు
ABN , First Publish Date - 2021-11-26T20:53:58+05:30 IST
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రూపొందించిన నివేదిక శుక్రవారం అసెంబ్లీకి వచ్చింది.
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రూపొందించిన నివేదిక శుక్రవారం అసెంబ్లీకి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక సభ ముందుకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల నిర్వహణపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి... తరువాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని కాగ్ పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయంది. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును ప్రభుత్వం బలహీనపరిచిందని పేర్కొంది. ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించిందని, శాసన సభ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొంది.
అదనపు నిధులు ఆవశ్యకమని భావిస్తే... శాసన సభ నుంచి ముందస్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని కాగ్ పేర్కొంది. 2018 -19 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గాయంది. కొత్త సంక్షేమ పథకాల వల్ల రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం పెరిగాయంది. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20కి రెవెన్యూ లోటు 90.24 శాతం మేర పెరిగిందని పేర్కొంది. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి రూ. 32,373 కోట్ల మేర బకాయిల చెల్లింపులు పెరిగాయంది. చెల్లించాల్సిన బకాయిల వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదని, శానస వ్యవస్థను నీరు గార్చేలా నిధుల నిర్వహణ ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది.