పిలిపించి.. నోటీసు ఇచ్చి పంపాం: ఎస్పీ

ABN , First Publish Date - 2021-01-22T09:13:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్టు.. విడుదల వ్యవహారంపై విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందించారు.

పిలిపించి.. నోటీసు ఇచ్చి పంపాం: ఎస్పీ

విజయనగరం క్రైం, జనవరి 21: తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్టు.. విడుదల వ్యవహారంపై విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘తనపై హత్యాయత్నం జరిగినట్టు నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో ఈ నెల 2న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. విచారణ కోసం మాజీ మంత్రి కళా వెంకటరావును హాజరుకావాల్సిందిగా పోలీసులు పలుపర్యాయాలు కోరారు. అయినా, ఆయన స్పందించలేదు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయనగరం రూరల్‌ పీఎస్‌ ఎస్‌ఐ మంగవేణి బుధవారం ఆయనను విచారణకు పిలిచించి.. నోటీసు ఇచ్చి తిరిగి పంపించివేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశాం’’ అని రాజకుమారి వివరించారు. కాగా, విజయసాయిరెడ్డిపై దాడి కేసులో అరెస్టయిన వారిని గురువారం జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. వీరికి కోర్టు 14రోజుల పాటు రిమాండ్‌ విధించింది. 

Updated Date - 2021-01-22T09:13:23+05:30 IST