పల్లెల్లో ప్రశాంత వాతావరణం

ABN , First Publish Date - 2021-11-29T04:26:30+05:30 IST

నాడు పోలీసు బూట్ల చప్పుడు, లాఠీ దెబ్బలతో తెల్లవారే పల్లెలు నేడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.

పల్లెల్లో ప్రశాంత వాతావరణం
కాసిపేట మండలం వెంకటాపూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
వెంకటాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

కాసిపేట, నవంబరు 28: నాడు పోలీసు బూట్ల చప్పుడు, లాఠీ దెబ్బలతో తెల్లవారే పల్లెలు నేడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.   మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో పోలీసులు అంటే కొట్టేందుకే పుట్టారనే భావన ఉండేదని చెప్పారు. కానీ నేడు ఆ పరిస్థితులు మారిపోయి కుటుంబ సభ్యుల్లో పోలీసులు కలిసి పోతున్నారని,  అన్నారు. ఇందుకు ఈ మెగా వైద్య శిబిరమే ఉదాహరణ అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళలు ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో పాటు స్ర్తీ సమస్యలతో బాదపడుతున్నారని, వారికి ప్రత్యేకంగా వైద్య సేవలందించి నాణ్యమైన మందులను అందించాలని కోరారు. నిత్యం విధుల్లో బిజీగా ఉంటూ ఒత్తిడికి గురయ్యే పోలీసులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు ఎంతో పురోగతిని కనబరుస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ , సంక్షేమం కోసం షీటీంలను ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించిందన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలను, సామాజిక సేవా కార్యక్రమాలను పోలీసులు మరిన్ని చేపట్టాలని ఆయన కోరారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు.  అనంతరం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు శాంతి భద్రతల రక్షణకు సహకరిస్తే పల్లె ప్రగతిని పరుగులు పెట్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా చూస్తామని అన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉంటే పోలీసులు అభివృద్ధికి చేయూతనందిస్తారని చెపాపరు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజలందరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలతో విలువైన జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. మూఢనమ్మకాలను విశ్వసించొద్దని సూచించారు. రోగాల బారిన పడితే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు ఏమైనా సమస్యలుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని గ్రహించాలని చెప్పారు. ప్రజలందరు పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం 2 వేల మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో భాగస్వాములైన మంచిర్యాల మెడిలైఫ్‌ ఆసుపత్రి వైద్య బృందాన్ని ఆయన అభినం దించారు. ఈ శిబిరంలో 3 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 800 మందిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. కార్యక్రమంలో ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ అధ్యక్షుడు ఎస్‌కే పాండే, బెల్లంపల్లి ఓఎస్‌డీ శరత్‌చంద్రపవార్‌, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌, మెడిలైఫ్‌ వైద్యులు కంఠం కుమారస్వామి, చేతన్‌ చౌహాన్‌, నూతన్‌ అరవింద్‌, జ్యోతిర్మయి, స్వప్నిక, సర్పంచు సౌందర్యశంకర్‌, దేవాపూర్‌ ఎస్‌ఐ విజయేందర్‌, మండల ఆర్‌ఎంపీ వైద్యులు , బెల్లంపల్లి పోలీసు సబ్‌ డివిజన్‌ పోలీసులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:26:30+05:30 IST