ప్రశాంతంగా ఎంసెట్
ABN , First Publish Date - 2020-09-29T06:06:29+05:30 IST
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్
7 పరీక్ష కేంద్రాల్లో 3,548 మందికి 3,113 మంది హాజరు
తిమ్మాపూర్, సెప్టెంబరు 28: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఎంసెట్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలంలోని ఐయన్ డిజిటల్ జోన్, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సైన్సెస్, కరీంనగర్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, హుజురాబాద్లోని కమల ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సైన్సెస్ మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటి సెషన్లో 1,837 మందికి 1,595, రెండో సెషన్లో 1,711 మందికి 1,518 మంది మొత్తంగా 3,548 మందికి 3,113 మంది పరీక్షకు హాజరుకాగా 435 మంది విద్యార్థుల గైర్హాజరైనట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.శ్రీలక్ష్మి తెలిపారు.
రెండో రోజు మంగళవారం 6 పరీక్ష కేంద్రాలలో 2,280 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రీజినల్ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా పరీక్ష కేంద్రల లోపల, బయట రెండు పూటల శానిటైజేషన్ చేశారు. ప్రతి విద్యార్థిని థర్మల్ స్ర్కినింగ్ చేసిన అనంతరం కేంద్రంలోకి అనుమతించారు. కొన్ని పరీక్ష కేంద్రలలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకొనేందుకు ఇబ్బందిపడ్డారు. తిమ్మాపూర్లో రాజీవ్ రహదారిపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎల్ఎండి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.