భైంసాలో ప్రశాంతంగా నిమజ్జనం

ABN , First Publish Date - 2021-10-17T06:21:30+05:30 IST

నిర్మల్‌ జిల్లా భైంసాలో దుర్గా ప్రతిమల నిమజ్జనం శనివారం ప్రశాంతంగా ముగిసింది.

భైంసాలో ప్రశాంతంగా నిమజ్జనం
భైంసా ప్రధానవీధిలో దుర్గామాత శోభాయాత్ర

భైంసా, అక్టోబరు 16 :  నిర్మల్‌ జిల్లా భైంసాలో దుర్గా ప్రతిమల నిమజ్జనం శనివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవ శోభయాత్ర రాత్రివరకు కొనసాగింది. స్థానిక విశ్రాంతి భవనం వద్ద గల భవానీచౌక్‌ సార్వజనిక్‌ దుర్గామాత మండలి వద్ద ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, ఏఎస్పీ కిరణ్‌కారేలు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. శోభయాత్రలో యువకులు నృత్యాలు చేయగా మహిళలు కోలాటాలు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు సంఘాలు భక్తులకు భారీగా ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన విగ్రహాల శోభాయాత్ర గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరకు కొనసాగింది. అక్కడ ముగింపు పూజలు నిర్వహించి విగ్రహాలను గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు.  

భారీ బందోబస్తు

భైంసా క్రైం, అక్టోబరు 16 : నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీభద్రత  చేపట్టారు. తనిఖీ కేంద్రాలు, ప్రధానకూడళ్లు, రహదారులు, ప్రార్థనా మందిరాలు, ఆల యాల వద్ద పోలీస్‌ పికెటింగ్‌లు పెట్టారు. శోభాయాత్రకు ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను స్థానికపట్టణ పోలీస్‌స్టేషన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించారు.  వీటికి తోడు వీడియో కెమెరాలతో మొబైల్‌బృందాలు రికార్డింగ్‌ చేశాయి. ఏఎస్పీ కిరణ్‌కారే ఆధ్వర్యంలో 200 పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:21:30+05:30 IST