కేసీఆర్.. పేదల ఆకలి కేకలు వినపడవా?: Vijayashanti
ABN , First Publish Date - 2022-06-21T01:33:18+05:30 IST
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు బియ్యం ఆలస్యంగా అందుతోంది. రేషన్ దుకాణాలకు
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం ఆలస్యంగా అందుతోంది. రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటా ఆలస్యంగా ఇస్తుండడంతో డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్లే..
‘‘తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలన సాగుతోంది. ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికీ కోత పెట్టారు. రూపాయికి కిలో బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదు. రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోంది. సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీరు వల్ల ప్రజలే కాదు..డీలర్లూ నష్టపోతున్నారు. రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి కాగానే... 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుని, 30వ తేదీలోగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలి. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల ఇదంతా ఆలస్యమవుతోంది. కేసీఆర్.. పేదల కడుపు మీద కొట్టడం ఎంత వరకు సమంజసం? పేదలకు నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాలంటే రేషన్ బియ్యమే శరణ్యం. కానీ పేద బతుకులతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోంది. కేసీఆర్... వీరి ఉసురు ఊరికే పోదు. నువ్వు, నీ సర్కార్ మట్టి కొట్టుకుపోవడం ఖాయం.’’ అని తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు.