ఆగస్టు 21 వరకు భారత్ విమానాలకు నో ఎంట్రీ: కెనడా

ABN , First Publish Date - 2021-07-20T12:23:44+05:30 IST

వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న అమెరికన్లు, కెనడా పౌరసత్వం కలిగిన వారు ఆగస్టు 9వ తేదీ నుంచి తమ

ఆగస్టు 21 వరకు భారత్ విమానాలకు నో ఎంట్రీ: కెనడా

ఒట్టావా: భారత్ నుంచి వచ్చే ప్యాసెంజర్ విమానాలపై ఉన్న ఆంక్షలను ఆగస్టు 21 వరకు పొడిగిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ నెలలో భారత్ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో ఏప్రిల్ 22న కెనడా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ప్యాసెంజర్ విమానాలపై జూలై 21 వరకు ఆంక్షలను విధించింది. అయితే ఈ ఆంక్షలను మరో నెల రోజుల పాటు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ‘‘భారత్‌లో పరిస్థితులు ఇంకా సీరియస్‌గానే ఉన్నాయి. డెల్టా వేరియెంట్ భారత్‌లో ఇంకా ప్రబలంగానే ఉంది. కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సూచనల మేరకే ఆంక్షలను పొడిగించాం’’ అని కెనడా రవాణాశాఖ మంత్రి ఒమన్ అల్ఘాబ్రా తెలిపారు.  


ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న అమెరికన్లు, కెనడా పౌరసత్వం కలిగిన వారు ఆగస్టు 9వ తేదీ నుంచి కెనడాలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి కెనడాలోకి అడుగుపెట్టవచ్చని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా కెనడా ప్రభుత్వం గతేడాది మార్చిలో సరిహద్దులను, ఎయిర్‌పోర్టులను మూసివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం అత్యవసర పనులకు ప్రయాణించే వారికి తప్పించి ఇతరులకు కెనడాలోకి ప్రవేశం లేదు. 


పర్యాటకశాఖ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికి ట్రూడో ప్రభుత్వం మాత్రం ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తూనే వచ్చింది. అయితే కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయంపై అటు అమెరికన్లతో పాటు విదేశీయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కెనడాలోకి ప్రవేశించాలనుకునే వారికి ఎటువంటి కరోనా లక్షణాలు ఉండకూడదని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కెనడాలోకి అడుగుపెట్టాల్సి ఉంటుందని సూచించింది.


Updated Date - 2021-07-20T12:23:44+05:30 IST