ఆరోగ్యంగా ఉన్నవారికీ స్ర్కీనింగ్ అవసరం!
ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST
కేన్సర్ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలికగా నయం చేయవచ్చు. అయితే కేన్సర్ను గుర్తించడంలో రెండు అంశాలు ఎంతో కీలకం. 1. కేన్సర్ వ్యాధి ముందస్తు లక్షణాల గురించి తెలుసుకోవడం 2. స్ర్కీనింగ్.
కేన్సర్ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలికగా నయం చేయవచ్చు. అయితే కేన్సర్ను గుర్తించడంలో రెండు అంశాలు ఎంతో కీలకం. 1. కేన్సర్ వ్యాధి ముందస్తు లక్షణాల గురించి తెలుసుకోవడం 2. స్ర్కీనింగ్.
1. ముందస్తు లక్షణాలు: గడ్డలు, అసాధారణ రక్తస్రావం, దీర్ఘకాలం పాటు అజీర్తి మొదలైనవి కేన్సర్ ముందస్తు లక్షణాలలో కొన్ని. రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్, నోటి, పెద్దపేగు కేన్సర్, చర్మ కేన్సర్ వంటి వాటిలో ఈ లక్షణాలతో కేన్సర్ను ముందుగానే గుర్తించవచ్చు.
2. స్ర్కీనింగ్: ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో నిగూఢంగా ఉన్న కేన్సర్ను గుర్తించడానికి నిర్వహించే పరీక్ష స్ర్కీనింగ్. లక్షణాలు ఇంకా బయటపడని వ్యక్తుల్లో నిర్వహించే సాధారణమైన, సులభమైన పరీక్ష.
కేన్సర్ వచ్చే వీలున్న వ్యక్తులు
- పొగ తాగేవారు, పొగాకు నమలడం (జర్దా, పాన్ మసాలా, గుట్కా) అలవాటు ఉన్నవారు
- మద్యానికి బానిసలైనవారు, సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధులు కలిగినవారు
- వ్యాయామం చేయనివారు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు, ఊబకాయులు
- పీచు పదార్థం తక్కువగా, మసాలాలు ఎక్కువగా తినేవారు
- మహిళలకు స్ర్కీనింగ్ పరీక్షలు
- రొమ్ము కేన్సర్: 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి వైద్యుల సహాయంతో రొమ్ము పరీక్ష, డిజిటల్ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.
- 20 నుంచి 30 ఏళ్ల మఽధ్య వయసు మహిళలు మూడేళ్లకోసారి వైద్యుల సహాయంతో రొమ్ము పరీక్ష చేయించుకోవాలి.
- 20 ఏళ్లు నిండిన మహిళలు కణుతులు, గడ్డల కోసం ఇంటి దగ్గరే రొమ్ములు పరీక్షించుకుంటూ ఉండాలి.
గర్భాశయ ముఖద్వార కేన్సర్
సెక్స్లో పాల్గొనడం మొదలుపెట్టిన మూడేళ్ల నుంచి గర్భాశయ ముఖద్వారానికి స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సాధారణ పి.ఎ.పి పరీక్షా పద్ధతిలో ఏడాదికోసారి స్ర్కీనింగ్ చేయించుకోవాలి. లిక్విడ్ బెస్ట్ పి.ఎ.పి పద్ధతి అయితే రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. 30 ఏళ్లు పైబడినవాళ్లు మూడేళ్లకోసారి పి.ఎ.పి పరీక్ష, హెచ్.పి.వి డి.ఎన్.ఎ పరీక్ష చేయించుకుంటే మంచిది. కానీ హెచ్.ఐ.వి ఉన్నవారు అవయవమార్పిడి, కీమోథెరపీ, మత్తుపదార్థాలకు బానిసలవడం వంటి రోగనిరోధకశక్తి కోల్పోయినవారు ప్రతి ఏడాది పైన చెప్పిన పరీక్ష చేయించుకోవాలి. 10 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు, 46 ఏళ్లలోపు మహిళలకు సర్వైకల్ కేన్సర్ వ్యాక్సీన్ ఇప్పించడం వల్ల 90ు వరకూ ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.
మగవారికి కేన్సర్ పరీక్షలు
ప్రోస్టేట్ కేన్సర్: 50 ఏళ్లు నిండిన పురుషులు ప్రతి ఏడాదీ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ రక్తపరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా (నాన్న, సోదరుడు, కొడుకు) ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లైతే 40 ఏళ్ల వయసునుంచే ప్రోస్టేట్ స్ర్కీనింగ్ చేయించుకోవాలి.
- -డాక్టర్ సిహెచ్.మోహన వంశీ
- చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
- ఒమేగా హాస్పిటల్స్,
- హైదరాబాద్.ఫోన్: 9848011421