‘టెట్‌’ ఆశలు ఆవిరి!

ABN , First Publish Date - 2022-10-01T15:49:01+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు

‘టెట్‌’ ఆశలు ఆవిరి!

కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు..

ఆపై దిద్దుబాటు 


అమరావతి, అనంతపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు రూ.6 కోట్లు వృథాగా మారింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభ్యర్థులు పరీక్షలకు దూరం కాలేదు. 2018 తర్వాత నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెట్‌కు ఏకంగా 5,25,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ(School Education Department) కేవలం 150 పరీక్ష కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో చాలావరకూ ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండటంతో ఏపీ(Andhra Pradesh)లో కేంద్రాలు దొరకని వారు పరీక్షలు రాయలేకపోయారు.  


ఐదుగురికి 150 మార్కులు

ఈ ఏడాది టెట్‌ రాసిన 4,07,329 మందిలో 2,36,535 (58.07%) మంది అర్హత సాధించారు. వారిలో ఐదుగురికి 150 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనరల్‌ అభ్యర్థులకు 60శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌ కోటా అభ్యర్థులకు 40శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. మరోవైపు టెట్‌ ఫలితాల్లో వింతలు చోటుచేసుకున్నాయి. 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి నూరు శాతానికి పైగా మార్కులు రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన వడ్ల మంజుల 150కి గాను 150.26958 మార్కులు వచ్చాయి. మరో అభ్యర్థికి 150.86, ఇంకొకరికి 15.64 మార్కులు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాయంత్రానికి వీటిని సరిదిద్దడంతో ఊపిరి పీల్చుకున్నారు.  


నిపుణుల మాట

నార్మలైజేషన్‌ పద్ధతిలో మార్కులు కేటాయించినప్పుడు వందశాతానికి పైగా మార్కులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఆర్‌ఆర్‌బీ, నీట్‌, ఇతర పోటీ పరీక్షల్లో ఇలా జరిగే అవకాశం ఉందని వారు అన్నారు. అయితే టెట్‌ ఫలితాలలో వందశాతానికి పైగా మార్కులు రావడానికి సాం కేతిక సమస్యలు కారణమై ఉండొచ్చని అన్నారు. టెట్‌లో వచ్చిన ప్రతి 7.5 మార్కులకు డీఎస్సీలో ఒక మార్కు కలుపుతారు. ఈ ప్రాతిపదికన టెట్‌లో 150కి 150 మార్కులు వస్తే డీఎస్సీలో గరిష్ఠంగా 20 మార్కులు కలుపుతారు. మరి టెట్‌లో 150కిపైగా మార్కులు వస్తే.. డీఎస్సీలో ఎన్ని మార్కులు యాడ్‌ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


ఉలిక్కిపడి మార్చేశారా..?

టెట్‌ ఫలితాలు విడుదల చేశాక, ప్రభు త్వం ఉలిక్కిపడి, సరిదిద్దుకున్నట్లు తెలుస్తోంది. వడ్ల మం జులకు ఉదయం 150 మార్కులుకు 150.26958 మార్కులు వచ్చినట్లు చూపించారు. వెబ్‌సైట్‌లో సాయంత్రం పరిశీలిస్తే 150 మార్కులు కనిపించాయి. ఈ మేరకు మార్కులను కుదించారు. ఇలా చాలా మంది అభ్యర్థులకు వందశాతానికి పైగా మార్కులు వేసి, తరువాత తగ్గించారు. నార్మలైజేషన్‌ పద్ధతిని అనుసరించి.. 100 శాతానికి పైగా మార్కులు ఇచ్చి ఉంటే.. మళ్లీ ఎందుకు కుదిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. టెట్‌ ఫలితాలు సర్కారు పనితీరును ప్రశ్నించేలా చేశాయి. 


మంజుల సత్తా

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కొర్రెమానిపల్లికి చెందిన కొండయ్య, వరలక్ష్మి దంపతుల కూతురు వడ్ల మంజుల 150 మార్కులు సాధించింది. మంజుల తల్లిదండ్రులు కూలీలు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఆమె గుత్తి ఏపీఆర్‌ఎ్‌సలో చదువుకుంది. 10వ తరగతిలో 9.3 గ్రేడ్‌ పాయింట్లు సాధించింది. ఇంటర్‌ బనవాసి ఏపీఆర్‌జేసీలో చదివి, ఎంపీసీలో 977 మార్కులు సాధించింది. బుక్కపట్నం డైట్‌లో టీటీసీ పూర్తి చేసింది. టెట్‌ పరీక్షలు అనంతపురం జిల్లాలో రాసి, వందశాతం మార్కులు సాధించింది. కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు తనకు ఉచితంగా శిక్షణ ఇచ్చారని, మొదట టీచర్‌ ఉద్యోగం సంపాదించి, తరువాత గ్రూప్స్‌, సివిల్స్‌కు సిద్ధమవుతానని మంజుల తెలిపింది.


కూలి దంపతుల కూతురికి 150... టీచర్ల బిడ్డకు 147 మార్కులు 

టెట్‌ ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులు మంచి మార్కులు సాధించారు. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకూ అనంతపురం జిల్లాలో 7 కేంద్రాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒక కేంద్రం, బెంగళూరులోని 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 


తేజశ్వినికి 147

అనంతపురం నగరానికి చెందిన తేజస్విని 150 మార్కులకు గాను 147.20146 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రామకృష్ణ వజ్రకరూరు జడ్పీహెచఎ్‌సలో ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, తల్లి క్రిష్ణవేణి బత్తలపల్లి బాయ్స్‌ హైస్కూల్‌లో హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తేజస్విని 10వ తరగతిలో 9.8 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. ఇంటర్‌లో 934 మార్కులు సాధించింది. రాయచోటి డైట్‌ కళాశాలలో డీఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఉపాధ్యాయణిగా స్థిరపడతానని తేజశ్విని తెలిపింది.



Updated Date - 2022-10-01T15:49:01+05:30 IST