మైక్రోసాఫ్ట్ చేతికి క్యాండీక్రష్
ABN , First Publish Date - 2022-01-19T05:57:23+05:30 IST
తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యంలో దూసుకెళ్తోన్న మైక్రోసాఫ్ట్.. గేమింగ్
- ఒప్పందం విలువ రూ.5.15 లక్షల కోట్లు
- ప్రపంచ గేమింగ్ రంగంలో అతిపెద్ద డీల్
న్యూఢిల్లీ: తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యంలో దూసుకెళ్తోన్న మైక్రోసాఫ్ట్.. గేమింగ్ వ్యాపార విస్తరణలో భాగంగా మెగా డీల్ కుదుర్చుకుంది. క్యాండీక్రష్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందిన వీడియోగేమ్స్ను అభివృద్ధి చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే అమెరికన్ కంపెనీని 6,870 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5.15 లక్షల కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పందంలో భాగంగా యాక్టివిజన్ బ్లిజార్డ్కు చెందిన ఒక్కో షేరుకు 95 డాలర్లు చెల్లించనుంది.
గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లో యాక్టివిజన్ బ్లిజార్డ్ షేర్ల ముగింపు ధరతో పోలిస్తే 45 శాతం అధికమిది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇప్పటివరకిదే అతిపెద్ద డీల్. అంతేకాదు, ఈ కొనుగోలుతో మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో మూడో అతిపెద్ద గేమింగ్ కంపెనీగా అవతరించనుంది. ఎక్స్బాక్స్ పేరుతో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వీడియో గేమింగ్ సేవలందిస్తోంది. మొబైల్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ), కన్సోల్, క్లౌడ్ ఇలా అన్ని వేదికల గేమింగ్ సేవలను మరింత విస్తరించడంతోపాటు భవిష్యత్లో మెటావర్స్ సేవలందించేదుకూ ఈ డీల్ దోహదపడనుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అంతేకాదు, ఈ డీల్ ద్వారా సోనీ ప్లేస్టేషన్కు మైక్రోసాఫ్ట్ మరింత గట్టిపోటీనివ్వనుందని మార్కెట్ వర్గాలంటున్నాయి.