Pakistan Terrorist : ఆ ఉగ్రవాది లక్ష్యం భారత్‌పై దాడి... కానీ...!

ABN , First Publish Date - 2022-09-04T15:55:42+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని రాజౌరీలో సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

Pakistan Terrorist : ఆ ఉగ్రవాది లక్ష్యం భారత్‌పై దాడి... కానీ...!

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోని రాజౌరీలో సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థానీ ఉగ్రవాది శనివారం మరణించాడు. రెండు వారాల క్రితం మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినపుడు భద్రతా దళాల కాల్పుల్లో అతను గాయపడ్డాడు. వెంటనే అతనిని సైనిక ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. అయితే గుండెపోటు రావడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 


భద్రతా దళాలు తెలిపిన వివరాల ప్రకారం ఆ పాకిస్థానీ ఉగ్రవాది పేరు తబ్రక్ హుస్సేన్. అతను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని సబ్జ్‌కోట్ గ్రామస్థుడు.  గత నెలలో అతను రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టర్‌లో నియంత్రణ రేఖ (LoC)ని దాటి, మన దేశంలో చొరబడేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని గుర్తించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో అతను గాయపడ్డాడు. వెంటనే అతనిని రాజౌరీలోని సైనిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అతనిని ప్రశ్నించినపుడు, తనను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కల్నల్ యూనస్ చౌదరి పంపించారని చెప్పాడు. ఇండియన్ ఫార్వర్డ్ పోస్ట్‌లపై దాడి చేసేందుకు తనను పంపించారని చెప్పాడు. తనకు 30,000 పాకిస్థానీ రూపాయలు ఇచ్చారని తెలిపాడు. తాను మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఇండియన్ ఫార్వర్డ్ పోస్టులపై రెక్కీ నిర్వహించానని చెప్పాడు. అవకాశం వచ్చినపుడు దాడి చేసేందుకు ప్రయత్నించామని చెప్పాడు. 


ఈ ఉగ్రవాది పట్టుబడటం ఇది రెండోసారి.  2016లో ఇతనితోపాటు ఇతని సోదరుడు హరూన్ అలీ కూడా ఇదే సెక్టర్‌లో పట్టుబడ్డాడు. అయితే 2017 నవంబరులో మానవతావాద కారణాలపై తిరిగి వీరిని పాకిస్థాన్ పంపించేశారు. 


Updated Date - 2022-09-04T15:55:42+05:30 IST