మరిన్ని కంపెనీల కార్ల ధరలు పెంపు?
ABN , First Publish Date - 2021-12-06T07:22:47+05:30 IST
టాటా మోటార్స్, హోండా, రెనో వంటి కంపెనీలు కార్ల ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో ..
న్యూఢిల్లీ : టాటా మోటార్స్, హోండా, రెనో వంటి కంపెనీలు కార్ల ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో కొంత భారాన్ని కస్టమర్లపై వేసే లక్ష్యంతో జనవరి నుంచి కార్ల ధరలు పెంచవచ్చునని ఆ కంపెనీల వర్గాలు తెలిపాయి. మారుతి, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు ఇప్పటికే కార్ల ధరలు పెంచాయి. ఉక్కు, అల్యూమినియం, రాగి, ఇతర లోహాలు, ప్లాస్టిక్ ధరలు, ముడిసరకు వ్యయాలు పెరిగినందు వల్ల ఆ భారాన్ని తగ్గించుకునేందుకు సమీప భవిష్యత్తులోనే కొంత మేరకైనా ధరలు పెంచక తప్పదని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల విభాగం ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర అన్నారు. తమపై ముడిసరకు ధరల భారం అధికంగా ఉన్నదని, అందులో ఎంత వాటా తాము భరించగలమనేది పరిశీలిస్తున్నామని హోండా కార్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. తాము కార్ల ధరలు కాస్తంత భారీగానే పెంచే అవకాశం ఉన్నట్టు రెనో కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.