విద్యుదాఘాతంతో పది గేదెలు మృతి
ABN , First Publish Date - 2022-08-18T03:28:01+05:30 IST
మండలంలోని ఆర్లపడియ, ఉప్పరపల్లి గ్రామాలకు చెందిన పది గేదెలు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డాయి. ఈ సంఘట
ఉదయగిరి రూరల్, ఆగస్టు 17: మండలంలోని ఆర్లపడియ, ఉప్పరపల్లి గ్రామాలకు చెందిన పది గేదెలు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. ఆయా గ్రామాలకు చెందిన గేదెలు సోమవారం మేత కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాయి. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో యజమానులు బుధవారం ఉదయం గండిపాళెం జలాశయం పైతట్టునున్న అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అక్కడ గేదెలు విద్యుత్ షాక్తో మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణుల కోసం విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. మేతకు వెళ్లిన మూగజీవాలు ఆ కంచె బారినపడి మృత్యువాతపడ్డాయి. ఉప్పరపల్లికి చెందిన రావూరి సుబ్బరాయుడుకు చెందిన 3, ఆర్లపడియకు చెందిన తల్లపరెడ్డి పిచ్చిరెడ్డికి చెందిన 2 గేదెలు మృతిచెందగా, మరో ఐదు గేదెలను గుర్తించాల్సి ఉంది. ఈ మేరకు బాధితులు పోలీసులకు, విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.
-----------