కరోనాతో వస్తే ఆస్పత్రిలో చేర్చుకోవలసిందే
ABN , First Publish Date - 2020-08-09T10:16:48+05:30 IST
కరోనా పాజిటివ్ రిపోర్టుతో ఎవరు వచ్చినా చికిత్స చేయాల్సిందేనని, ఖాళీలు లేవు...ఆ ఆస్పత్రికి వెళ్లండి...ఈ ఆస్పత్రికి వెళ్లండి
వెనక్కి పంపితే ఊరుకునేది లేదు
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరిక
ప్రైవేటు ఆస్పత్రులు కూడా
విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్ రిపోర్టుతో ఎవరు వచ్చినా చికిత్స చేయాల్సిందేనని, ఖాళీలు లేవు...ఆ ఆస్పత్రికి వెళ్లండి...ఈ ఆస్పత్రికి వెళ్లండి అంటే...ఊరుకునేది లేదని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం వైద్యాధికారులకు హెచ్చరించారు. కొవిడ్ వైద్య సేవలపై ఆయన వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమ్స్ పనితీరు ఇంకా మెరుగుపడలేదని, ప్రతి దానికీ సిబ్బంది తక్కువని సాకులు చెబుతున్నారని, ఇకపై అలా చెప్పడానికి వీల్లేదని హెచ్చరించారు. రోగులను బంధువులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించే ఏర్పాటు చేయాలన్నారు.
చెస్ట్ ఆస్పత్రి పనితీరుపై ప్రజల నుంచి విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయని, అక్కడ కొద్ది రోజులుగా కరోనా పరీక్షలు కూడా చేయడం లేదని తెలిసిందని, కారణాలు ఏమిటని మంత్రి ప్రశ్నించారు. కరోనా పరీక్షలు ఆపడానికి వీల్లేదని, కొనసాగించాలని ఆదేశించారు.
ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స అందించాల్సిందే
నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులైన సెవెన్హిల్స్, అపోలో, పినాకిల్, ఎన్ఆర్ఐ, కేర్లలో కరోనాకు వైద్య సేవలు అందుతున్నాయని, అక్కడికి తీవ్ర లక్షణాలతో వెళితే...చేర్పించుకోవడం లేదని, విమ్స్కు వెళ్లిపోవాలని చెబుతున్నారని, ఇకపై అలా చేయడానికి వీల్లేదని మంత్రి స్పష్టంచేశారు.
జనసమ్మర్ధ ప్రాంతాల్లో లాక్డౌన్
జనసమ్మర్థంగా వుండే ప్రాంతాలపై దృష్టిసారించి, అవసరమైతే కొద్దిరోజులు లాక్డౌన్ విధించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. ఆదివారం వస్తే ఫిషింగ్ హార్బర్, పూర్ణామార్కెట్, జిల్లాలో సంతల్లో జనాలు ఎక్కువగా ఉంటున్నారని, వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు.
మందులకు కొరత లేదు
జిల్లాలో మందులకు కొరత లేదని, వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నామని మంత్రి తెలిపారు.