ఆగిన టెస్టులు.. జిల్లాకు చేరుకోని కరోనా నిర్ధారణ కిట్లు
ABN , First Publish Date - 2021-04-23T05:27:41+05:30 IST
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన ఈ రెండేళ్ల కాలంలో తొలిసారి కిట్ల కొరత ఏర్పడింది. దీంతో ఖమ్మంజిల్లా ఆసుపత్రిలోని నిర్ధారణ కేంద్రం మూతపడింది.
ఒకేసారి నిలిచిన ర్యాపిడ్, ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు
రెండేళ్లలో తొలిసారి ల్యాబ్ మూత
మొబైల్ వాహనాల షెడ్యూల్ కూడా నిలుపుదల
ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్ 22: కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన ఈ రెండేళ్ల కాలంలో తొలిసారి కిట్ల కొరత ఏర్పడింది. దీంతో ఖమ్మంజిల్లా ఆసుపత్రిలోని నిర్ధారణ కేంద్రం మూతపడింది. దీంతో అసలే కొవిడ్ అనుమానంతో పరీక్షల కోసం వచ్చిన వారికి మరింత వేదన మిగులుతోంది. ఒక్కసారి గా కరోనా నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో జనం లబోదిబోమంటున్నారు. ర్యాపిడ్ పరీక్షలతో పాటు ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్ పరీక్షలు ఆగి పోవడంతో వందల సంఖ్యలో రోగులు వెనుదిరుగుతున్నారు.
జిల్లాకు రాని ర్యాపిడ్ కిట్స్
ఖమ్మం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం కరోనా స్పాట్ నిర్ధా రణ పరీక్షలకు వినియోగించే ర్యాపిడ్ కిట్ల కొరత ఏర్పడింది. అయితే గురువారం ఉద యం వరకు కిట్లు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఆ కిట్లు రాలేదు. దీంతో అత్యవసర కేసులకోసం ఉంచినకిట్లను మొబైల్ వాహనానికి కేటాయించి కొత్త బస్టాండ్ వద్ద పరీక్షలు చేశారు. అదే వాహనం మధ్యాహ్నం తర్వాత ఖమ్మం ఖానాపురంలో పరీక్షలు చేస్తామని షెడ్యూల్ ప్రకటించారు. కానీ కిట్లు అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్ రద్దు చేశారు.
మొరాయిస్తున్న ట్రూనాట్ మిషన్లు..
జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలకోసం ఏడాది క్రితం ట్రూ నాట్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మిషన్లు మోరా యిస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో కొద్ది రో జులుగా ల్యాబ్ఉద్యోగులు ట్రూనాట్ మిషన్లును పక్కన పెట్టారు.
అందుబాటులో లేని ఆర్టీపీసీఆర్ పరీక్షలు
ఖమ్మంలో ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రం లేకపోవడంతో శ్యాంపిళ్లను సూర్యాపేటకు పంపుతున్నారు. అయితే అక్కడ కూడా శాంపిళ్ల సంఖ్య ఎక్కు వగా ఉంటుండటంతో ఖమ్మం నుంచి పంపిన శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావడానికి వారం పడు తోందన్న విమర్శలున్నాయి.