ఇక విస్తృతంగా కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2021-04-18T05:11:39+05:30 IST
ఇక విస్తృతంగా కరోనా పరీక్షలు
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో..
విజయవాడలో ఐజీఎంసీ, డీఆర్ఆర్, బసవపున్నయ్య స్టేడియాలు, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో..
మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో..
మొబైల్ శాంపిల్ కలెక్షన్ ద్వారా పరీక్షలు
24 గంటల్లో ఫలితం వచ్చేలా చర్యలు : కలెక్టర్
విజయవాడ, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడైనా పరీక్షలు చేయించుకోవచ్చని, దీనికనుగుణంగా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం విడుదల చేసిన అత్యవసర బులెటిన్లో ఆయన తెలిపారు. మచిలీ పట్నంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, విజయవాడ నగరంలో ప్రభుత్వాసుపత్రితో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా పరీక్షలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షలు చేయించుకునేవారు తమ ఆధార్ నెంబర్ను పేపర్పై రాసి తీసుకురావాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మొబైల్ శాంపిల్ కలెక్షన్ యాప్లో నమోదు ఉంటుందని చెప్పారు. పరీక్షకు వచ్చిన వారి వివరాలను నమోదు చేశాక ఓ నెంబర్ను ఇస్తామన్నారు. అలాగే, పరీక్షా కేంద్రాల్లో శాంపిల్ ఇచ్చిన వారికి 24 గంటల్లో ఫలితం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. శాంపిల్ కలెక్షన్ ప్రక్రియ పూర్తి కాగానే, సంబంధిత ల్యాబ్లకు పంపిస్తామన్నారు. త్వరగా రిపోర్టులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.