కారు మబ్బుల్లో ఆర్థికం
ABN , First Publish Date - 2022-01-24T06:54:29+05:30 IST
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై పలు దట్టమైన మరకలున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు మంచి జిలుగులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు....
ఆర్బీఐ మాజీ గవర్నర్
రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై పలు దట్టమైన మరకలున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు మంచి జిలుగులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం భారీ లోటుకు తావు లేకుండా విభిన్న వ్యయాలను నిర్ణయించాలని ఆయన సూచించారు. దేశంలో నిరుద్యోగిత అధికంగా ఉండడం, దిగువ మధ్య తరగతి వర్గా ల కొనుగోలు శక్తి క్షీణించడం, చిన్న/మధ్య తరహా పరిశ్రమలపై ఆర్థిక ఒత్తిడి వంటివి ఆర్థిక వ్యవస్థపై గల దట్టమైన మరకలని ఆయన వివరించారు.
ఇదే సమయంలో భారీ పరిశ్రమలు, ఐటీ/ఐటీ ఆధారిత పారిశ్రామిక రంగాలు, యునికార్న్ల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం ఆర్థిక వ్యవస్థకు గల సానుకూలత అని రాజన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను కె-షేప్ రికవరీ (ఆర్థిక వ్యవస్థలో భిన్న వర్గాల మధ్య విభిన్న తీరులో రికవరీ) నుంచి కాపాడడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. తాను ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, చిన్న/మధ్యతరహా పరిశ్రమలు, భవిష్యత్ తరానికి ప్రతీకలైన బాలల గురించే ఆందోళన చెందుతున్నట్టు ఆయన చెప్పారు. డిమాండు పెరిగినప్పడు ఏర్పడే ప్రాథమిక పునరుజ్జీవం తర్వాతనే వీరందరూ కోలుకోగలుగుతారని ఆయన అన్నారు. ప్రస్తుత వాతావరణంలో 5 నుంచి 10 సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో కూడిన విజన్ పత్రం రావాలని తాను కోరుతున్నట్టు ఆయన తెలిపారు. అలాగే రాబోయే 5 సంవత్సరాల కాలానికి సమీకృత రుణ లక్ష్యం నిర్దేశించడంతో పాటు బడ్జెట్ నాణ్యతకు దిశానిర్దేశం చేయడానికి స్వతంత్ర ఆర్థిక మండలి ఏర్పాటు కావాలని రాజన్ సూచించారు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణుల గురించి మాట్లాడుతూ ఏ దేశానికైనా ద్రవ్యోల్బణం ఆందోళనకరమేనని, భారతదేశం అందుకు అతీతం కాదని ఆయన చెప్పారు. రాబోయే బడ్జెట్లో మరిన్ని సుంకాల కోతలు, సుంకాల ప్రోత్సాహకాలు తక్కువ ఉండేలా చూడాలన్నది తన అభిప్రాయమన్నారు.