భార్యను మట్టుబెట్టే యత్నం.. సీఆర్పీఎఫ్ జవానుపై కేసు
ABN , First Publish Date - 2021-10-15T01:54:09+05:30 IST
భార్యను హతమార్చేందుకు యత్నించిన సీఆర్పీఎఫ్ జవానుపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో
లక్నో: భార్యను హతమార్చేందుకు యత్నించిన సీఆర్పీఎఫ్ జవానుపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. యోగేశ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఘజియాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2019లో సునీతను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న సునీతను అది మానేయాల్సిందిగా యోగేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. ఉద్యోగం మానకుంటే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించినా ఆమె వైఖరిలో మార్పు రాలేదు.
ఇదే విషయమై ఈ నెల 8న దంపతుల మధ్య మరోమారు గొడవ జరిగింది. తాను ఉద్యోగం మానేది లేదని సునీత మరోమారు తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యోగేశ్ ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.