బంగారం మాయంపై కేసు
ABN , First Publish Date - 2021-04-18T05:18:28+05:30 IST
పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో బంగారు నగలు మాయమైన ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు.
- పోలీసుల అదుపులో బ్యాంకు సిబ్బంది
ఉయ్యాలవాడ, ఏప్రిల్ 17: పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో బంగారు నగలు మాయమైన ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. బ్యాంకులో శుక్రవారం 17 మంది ఖాతాదారులకు సంబంధించిన 1,300 గ్రాముల బంగారు నగలు మాయమ య్యాయి. విషయం తెలియగానే శనివారం తెల్లవారు జామున 2 గంటలకు నంద్యాల రీజనల్ మేనేజర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆరుగురు బ్యాంక్ ఉద్యోగులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నామని వెల్లడించారు. కాగా, బంగారు నగల అదృశ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 27 నుంచి సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదు. దీంతో బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారు నగలు మాయమైన విషయం తెలియగానే నగలు తాకట్టు పెట్టిన ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపు చేశారు. 17 మంది ఖాతాదారుల ఆభరణాలు మాత్రమే అదృశ్యం అయ్యాయని అధికారులు చెప్పడంతో మిగిలిన వారు ఊపిరి పీల్చుకున్నారు.