చంద్రగిరి టీడీపీ నేతలపైనే కేసులు
ABN , First Publish Date - 2021-10-24T07:18:53+05:30 IST
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు చంద్రగిరి మండల టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు.
చంద్రగిరి/తిరుపతి(లీగల్), అక్టోబరు 23: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు చంద్రగిరి మండల టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. జనాగ్రహ దీక్షలో వైసీపీ నేత చంద్రమౌళి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నేతలు రాకేష్చౌదరి, యశ్వంత్ చౌదరి,మరోవైపు చంద్రమౌళి రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం యశ్వంత్ చౌదరిపై వైసీపీ కార్యకర్తలు పోలీసుస్టేషన్ ముందే దాడి కూడా చేశారు. అయితే పోలీసులు టీడీపీ నేతలు యశ్వంత్చౌదరి, రాకేష్చౌదరి, భానుప్రకాష్రెడ్డిలపై కేసులు నమోదు చేశారు.వీరికి 15 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ శనివారం ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను తిరుపతి కోర్టు వద్ద చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని పరామర్శించి, ధైర్యం చెప్పారు. తమ నేతలపై నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరిలో జరుగుతోందని ధ్వజమెత్తారు.చంద్రగిరి టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు గౌస్బాషా, గంగపల్లి భాస్కర్, దొమ్మలపాటి సతీష్, నగరం రమేష్, ఈశ్వర్రెడ్డి, నగేష్ తదితరులున్నారు.