కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు
ABN , First Publish Date - 2021-04-23T05:47:57+05:30 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలో కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారిపై అధికారుల బృందం కేసులు నమోదు చేస్తోంది.
రంగంలోకి తహసీల్దార్, కమిషనర్ల బృందం
ఇద్దరిపై కేసు నమోదు
నిర్మల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారిపై అధికారుల బృందం కేసులు నమోదు చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి జిల్లా కేంద్రంలో చాలా మంది వ్యాపారులు కోవిడ్ నిబంధనలు ఉల్లంగించి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు జాగ్రత్తల విషయంలో ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికి ఫలితం కనిపించడం లేదు. మాస్క్లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్మల్ తహసీల్దార్ సుభాష్ చంధర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణతో పాటు పోలీసు అధికారులు ఓ బృందంగా ఏర్పడి నిబంధనలు ఉల్లంగిస్తున్న వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. ముఖ్యంగా అధిక జన సామర్థ్యంతో కిటకిటలాడే నారాయణ రెడ్డి మార్కెట్ను అలాగే పలు సూపర్ మార్కెట్లపైనా అధికారులు దాడులు నిర్వహించారు. స్తానిక నారాయణరెడ్డి మార్కెట్లో హీరా ట్రేడర్స్పై దాడి జరిపి నిబంధనలు ఉల్లంగించిన షేక్ షఫీ హైమద్పై అలాగే వినయ్ ఎంటర్ ప్రైజేస్ యజమాని భండారి వినయ్పై అధికారులు కోవిడ్ - 19 నిబంధనల ఉల్లంఘన చట్టం ఉపయోగించి కేసు నమోదు చేశారు. అలాగే మరికొన్ని దుకాణాలను కూడా తనిఖీ చేసి కోవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభాష్చంధర్ మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి వ్యాపారి కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారులు , సాధారణ ప్రజలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని కోరారు.